సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 10: జిల్లాలో ఈ నెల 16న జరిగే గ్రూప్-1 పరీక్ష సజావుగా నిర్వహించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్పీ రమణకుమార్తో కలిసి గ్రూప్-1 పరీక్ష నిర్వహణ, ఏర్పాట్లపై సంబంధిత అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, లైజనింగ్ అధికారులు, అసిస్టెంట్ లైజనింగ్ అధికారులతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 16న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రూప్-1 పరీక్ష నిర్వహించనున్నారని, ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బంధీగా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు జిల్లాలో 26 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో మొత్తం 8,654 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్టు వెల్లడించారు. సంగారెడ్డి, సదాశివపేట, పటాన్చెరు, రామచంద్రాపురంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో 24 మంది అభ్యర్థులు, 48 మంది అభ్యర్థుల చొప్పున పరీక్ష రాసేందుకు వీలుగా హాళ్లను గుర్తించి, అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి గదికి సీసీ కెమెరాలు అమర్చి మానిటరింగ్ చేయాలన్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని కలెక్టర్ ఆదేశించారు. జిరాక్స్ కేంద్రాలు, ఇంటర్నెట్ కేంద్రాలు మూసివేయాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ప్రతి కేంద్రం వద్ద ప్రాథమిక చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు ఆయా పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్లు అనుమతించడం జరగదని స్పష్టంచేశారు. దివ్యాంగ అభ్యర్థుల కోసం ర్యాంపులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. పరీక్షల నిర్వహణ జాగ్రత్తగా, బాధ్యతతో పూర్తి చేయాలని, పరీక్ష పూర్తయ్యే వరకు ఎవరినీ బయటకు పంపరాదని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి రాధికా రమణి, చీఫ్ సూపరింటెండెంట్లు, లైజనింగ్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.