సంగారెడ్డి, మే 5 (నమస్తే తెలంగాణ)/మెదక్: ప్రస్తుతం కరెం టు కోతలతో దేశ వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటిస్తున్నాయి. కానీ తెలంగాణలో అందుకు భిన్నంగా పరిశ్రమలు మూడు షిఫ్టులు పనిచేస్తున్నాయి. ఇదంతా సీఎం కేసీఆర్ ముందస్తు చూపుతోనే సాధ్యమైందని పరిశ్రమల యజమానులు చెబుతున్నారు. ఆసియాలోనే పెద్దదైన ఇండస్ట్రియల్ ఏరియా సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఉంది. జిల్లాలోని పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ను ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. జిల్లాలోని 614 మధ్య, భారీ పరిశ్రమలతోపాటు 5116 సూక్ష్మ పరిశ్రమలకు 24 గంటలు విద్యుత్ సరఫరా అవుతున్నది. వేసవిలోనూ విద్యుత్ కోతలు లేకపోవడంతో పరిశ్రమల్లో పనిచేస్తున్న 2.03 లక్షల మంది కార్మికులకు చేతినిండా పని దొరుకుతున్నది.
కోతల్లేకుండా విద్యుత్ సరఫరా..
రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పాలనను ప్రశంసిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం పవర్ హాలిడేలు లేకుండాపోయాయి. ఉమ్మడి పాలనలో సంగారెడ్డి జిల్లాలో వేసవిలో అన్ని కేటగిరిల్లో 224.23 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ వాడేది. టీఆర్ఎస్ పాలనలో అన్ని కేటగిరీలో ఏప్రిల్లో 385.98 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంది. ప్రస్తుతం 161.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ప్రభుత్వం ఎక్కడా కోతలు లేకుండా సరఫరా చేస్తున్నది.
పరిశ్రమలకు పవర్ ఫుల్
సంగారెడ్డి జిల్లాలో మొత్తం రూ.72,016 కోట్ల పెట్టుబడులతో 5,775 పరిశ్రమలు ఏర్పాటు చేశారు. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ పటాన్చెరులో ఉంది. పటాన్చెరు నియోజకవర్గంలోని పటాన్చెరు, బొల్లారం, ఖాజిపల్లి, గడ్డపోతారం, పాశమైలారం పారిశ్రామిక వాడల్లో అధిక సంఖ్యలో పరిశ్రమలు ఉన్నాయి. తాజాగా సుల్తాన్పూర్ మెడికల్ డివైజ్ పార్కులో సైతం కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో సైతం భారీ, మధ్య తరహా పరిశ్రమలున్నాయి. జిల్లాలో మొత్తం 5775 పరిశ్రమల్లో 458 మెగా, భారీ పరిశ్రమలు ఉన్నాయి. మధ్య తరహా 156, చిన్న, సూక్ష్మ పరిశ్రమలు 5116 పనిచేస్తున్నాయి. ఆయా పరిశ్రమల్లో మొత్తం 2,03,741 కార్మికులు పనిచేస్తున్నారు. ఉమ్మడి పాలనలో పరిశ్రమలకు కోతలు విధించటంతోపాటు పవర్ హాలీడేలు ప్రకటించేవారు.
అవసరం మేరకు సరఫరా
భారీ, మెగా, మధ్య తరహా, సూక్ష్మ పరిశ్రమలకు హైటెన్షన్ లైన్ ద్వారా అవసరమైన మేరకు విద్యుత్ను సరఫరా చేస్తున్నారు. గతనెల 1016 పరిశ్రమలు హెచ్టీ లైన్ ద్వారా 220.29 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగించుకున్నాయని ట్రాన్స్కో అధికారులు తెలిపారు. 5116 చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు ఎల్టీ లైన్ ద్వారా 6.20 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించుకున్నాయి. పరిశ్రమలకు ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా అవుతుండడంతో యాజమాన్యాలు పూర్తిస్థాయిలో ఉత్పత్తులు ఉత్పత్తి చేస్తున్నారు. జిల్లాలో ఫార్మా, ఔషధ రంగ కంపెనీలతోపాటు ఇతర కంపెనీలు మూడు షిఫ్టులు పనిచేస్తుండటంతో కార్మికులకు చేతినిండా పని దొరుకుతున్నది. ఉత్తర్ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా తదితర ప్రాంతాలకు చెందిన కార్మికులు వలసొచ్చి ఈ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా అవుతుండటంతో విదేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి. అధికారుల సమాచారం మేరకు గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని పరిశ్రమల నుంచి రూ.3వేల కోట్ల ఎగుమతులు జరిగాయి. ఇందులో ఫార్మా, బల్క్డ్రగ్, ఔషధ రంగ పరిశ్రమల ఉత్పత్తులు ఎక్కువగా విదేశాలకు ఎగుమతులయ్యాయి.
మెదక్లో..
మెదక్ జిల్లాలోని మనోహరాబాద్, తూప్రాన్, చేగుంట, చిన్నశంకరంపేట, నర్సాపూర్తో పాటు తదితర మం డల కేంద్రాల్లో 2500 పరిశ్రమలు ఉన్నాయి. నిత్యావసరాల వస్తువుల తయారీ నుంచి ప్యాకింగ్ వరకు ప్రతి వస్తువు ఉత్పత్తికి విద్యుత్ తప్పనిసరి. వీటికి నిరంతరాయంగా విద్యుత్ను సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని చిన్న, మధ్య తరగతి పరిశ్రమలతో పాటు భారీ పరిశ్రమలకు విద్యుత్ కోతలు లేకుండా టీఎస్ఎస్పీడీసీఎల్ చర్యలు తీసుకున్నది. గతంలో వారంలో నాలుగు రోజులు పవర్ హాలీడే ఇస్తే ఉత్పత్తి తగ్గడం, ధరలు పెరగడంతో పాటు యాజమాన్యాలు ఇబ్బందులు పడ్డాయి. ఈ ఇబ్బందులను తీర్చడానికి సీఎం కేసీఆర్ నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీంతో రియల్ రంగం ఊపందుకున్నది. మోటార్ మెకానిక్లకు తీరికలేకుండా పోయింది. కరెంటు ఉండడంతో చేతినిండా పని దొరుకుతున్నది. విద్యుత్ సరఫరాపై యాజమాన్యాలు, కార్మికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
నిరంతర విద్యుత్తో పరిశ్రమలకు జీవం
నిరంతర విద్యుత్ సరఫరా తెలంగాణలోని పరిశ్రమలకు జీవం పోసింది. వారంలో మూడు రోజులు విద్యుత్ కోతలు చూసిన మాకు, ఇప్పుడు నిరంతర విద్యుత్ సరఫరా చూస్తున్నాం. ఆర్డర్లు ఉన్న వారు మూడు షిప్టులు ఉత్పత్తి తీస్తున్నారు. జిల్లాలోని పారిశ్రామికవాడలన్నీ ఏడేండ్లుగా నిరంతరం ఉత్పత్తులు తీశాయి. తెలంగాణ సర్కార్ విద్యుత్ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నది. దేశంలోని అన్ని రాష్ర్టాలతో పోల్చుకుంటే తెలంగాణ విద్యుత్ పాలసీ ఉత్తమమైనది.
– చందుకుమార్ పొట్టి, పారిశ్రామికవేత్త పటాన్చెరు
ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుస్తున్నది..
ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల రూపంలో లబ్ధి చేకూరుస్తున్నది. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతనే ప్రజలందరూ సంతోషంగా జీవిస్తుండ్రు. ఏ కుటుంబాన్ని చూసినా ప్రభుత్వంతో ఏదో ఒక లబ్ధి జరిగింది. లాండ్రీ దుకాణాలకు నెలకు 250 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇవ్వడంతో మాకు చాలా మేలు జరుగుతున్నది. మా అత్తకు ఆసరా పింఛన్ వస్తున్నది. మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టే ప్రతి కార్యక్రమం పేద ప్రజలకు మేలు జరుగుతుంది.
– అనిత, లాండ్రీ షాపు ఓనర్, ఆర్సీపురం
తెలంగాణ రాకతో కార్మికులకు పెరిగిన ఉపాధి
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాకనే పరిశ్రమలకు 24గంటల కరెంట్ వస్తున్నది. ఇంతకుముందు వారంలో మూడు రోజులు కరెంటు బందుండేది. రాష్ట్రం వచ్చిన ఆరు నెలల్లోనే ఫుల్ కరెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు కంపెనీలు మూడు షిప్టులు నడుస్తున్నవి. కంపెనీలో పనిచేసే వర్కర్లకు ఓటీలు దొరకుతున్నయి. ఇంట్రెస్ట్ ఉన్నవారికి ఎక్కువ డబ్బులు వస్తున్నయి. కరెంట్ లేనప్పుడు జీతాల్లో కోతలు ఉండేవి. ఇప్పుడు ఫుల్ జీతంతో పాటు ఓటీ డబ్బులు వస్తున్నయి. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కరెంట్ వర్కర్లకు లాభం చేసింది.
– భాస్కర్రెడ్డి, తోషిబా, ఎంప్లాయి, రుద్రారం