సంగారెడ్డి, మార్చి 11: జాతీయ లోక్ అదాలత్లో ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా గతేడాది నిర్వహించిన లోక్ అదాలత్లో 33,308 కేసులు పరిష్కరించారు. 2021 ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు 4 సార్లు లోక్ అదాలత్ నిర్వహించారు. ఇందులో ప్రమాద, భూ తగాదా కేసుల్లో బాధితులకు రూ.22,97,97,370 కోట్ల నష్ట పరిహారాన్ని వసూలు చేసి అందజేశారు. నేడు (శనివారం) కేసులను పరిష్కరించేందుకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో 18 బెంచీలు ఏర్పాటు చేసి లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఉత్తర్వుల మేరకు, సంగారెడ్డి కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నారు. జిల్లాలోని కోర్టుల వారీగా బెంచీలు ఏర్పాటు చేసి కేసులు పరిష్కరించనున్నారు.
సత్వర న్యాయం అందేలా ఏర్పాట్లు..
ఉమ్మడి జిల్లాలో వివిధ కేసుల్లో రూ.కోట్ల పరిహారం వసూలు చేసి బాధితులకు అందజేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18 బెంచీలను ఏర్పాటు చేసి రాజీయే రాజమార్గం అనే విధానంతో కక్షిదారులకు సత్వర న్యాయం అందేలా కేసులు పరిష్కరించనున్నారు. ఈ లోక్ అదాలత్లో కక్షిదారులు, న్యాయవాదులు, పోలీసు, బ్యాంకు అధికారులు పాల్గొని, తమ కేసుల్లో రాజీ చేసుకోవడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, జహీరాబాద్, గజ్వేల్, నర్సాపూర్, నారాయణఖేడ్, జోగిపేట కోర్టుల్లో రాజీతో కేసులు పరిష్కరించారు. భూ తగాదాలు, క్రిమినల్, వాహన ప్రమాద, సివిల్ కేసుల పరిష్కారానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కక్షిదారులు వారివారి కోర్టుల్లోని కేసులను రాజీ చేయడానికి లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తులు సూచిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో పరిష్కరించిన కేసులు..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లోక్ అదాలత్లలో కోర్టుల వారీగా పరిష్కారమైన కేసుల వివరాలు. సివిల్ 207 కేసులు, క్రిమినల్ 33వేలు, వాహన ప్రమాదాలకు గురైన 101 కేసులను పరిష్కరించి, న్యాయం చేశారు. ఈ కేసుల్లో వాహన ప్రమాదాలు, భూ తగాదాల్లో నష్టపోయిన వారికి పరిహారం అందిజేసేందుకు యజమానుల నుంచి సుమారు రూ.22,97,97,370 కోట్లను వసూలు చేశారు. న్యాయసేవాధికార సంస్థ తరఫున నిర్వహించిన లోక్ అదాలత్లో ఏప్రిల్లో 1300, జులైలో 1227, సెప్టెంబర్లో 987, డిసెంబరులో 1284 కేసులు పరిష్కరించారు. ఇందులో బీఎస్ఎన్ఎల్, వాహన ప్రమాద కేసులు, కుటుంబ, భూ తగాదాలు, బ్యాంక్, చిట్ ఫండ్స్, చెక్ బౌన్స్ కేసుల్లో బాధితులకు పరిహారం అందజేసి, సత్వర న్యాయం కల్పించారు. నేడు నిర్వహించనున్న లోక్ అదాలత్లలో మరిన్ని కేసులు రాజీతో పరిష్కరించేందుకు ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి, కక్షిదారులు, న్యాయవాదులకు పలుమార్లు అవగాహన కల్పించారు. ఎక్కువ కేసుల్లో రాజీకి ప్రయత్నం చేయాలని సూచించిన విషయం తెలిసిందే.
లోక్ అదాలత్లలో న్యాయసేవలు..
ఉమ్మడి జిల్లాలో గతేడాదిలో 4సార్లు లోక్ అదాలత్లు నిర్వహించి బాధితులకు న్యాయం అందించారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లలో బాధితులకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నది. ఊరూరా ప్రజలకు న్యాయ సహాయంపై అవగాహన కల్పించేందుకు 4,138 అవగాహన సదస్సులు నిర్వహించింది. చట్టాలు, న్యాయ సేవలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. కేసులు వేసేందుకు ఆర్థిక స్థోమతలేని కక్షిదారులకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అండగా నిలుస్తున్నది. ఇప్పటివరకు 209మందికిపైగా ఉచితంగా న్యాయవాదులతో న్యాయ సాయం అందించారు. ఉమ్మడి జిల్లాలో లోక్ అదాలత్లలో న్యాయ సేవలు అందుకున్న వారు కోర్టులకు తిరుగకుండా రాజీతో పరిష్కరించుకోవడం హర్షణీయం.
ఉమ్మడి జిల్లాలో 18 బెంచీలు ఏర్పాటు..
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో లోక్ అదాలత్లను ఏర్పాటు చేసి బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రం కోర్టులో 6 బెంచీలు, మెదక్ 3, సిద్దిపేట 3, జహీరాబాద్ కోర్టులో 2, నారాయణఖేడ్, అందోల్- జోగిపేట్, నర్సాపూర్, గజ్వేల్ కోర్టుల్లో ఒక్కొక్కటి చొప్పున 18 బెంచీలు ఏర్పాటు చేసి కేసులు పరిష్కరించనున్నారు.