సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 15 : నేటి నుంచి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి 100 శాతం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావుకు సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్పై జిల్లా యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రోజుకు 3 లక్షల మందికి టీకా వేయాలనే లక్ష్యం ఉన్నందున హ్యాబిటేషన్, వార్డులవారీగా వ్యాక్సినేషన్ పూర్తి చేసి డిక్లరేషన్ చేయాలన్నారు. డీఏంహెచ్వో పూర్తి స్థాయిలో ప్రణాళికాబద్ధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ఇందుకోసం జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలన్నారు. వ్యాక్సినేషన్ పూర్తయిన ఇండ్లకు స్టిక్కర్లు వేయాలన్నారు. ఒక ఉద్యమంలా వ్యాక్సినేషన్ నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలని ఆయన సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సినేషన్ ఇచ్చామని తెలిపారు.
జిల్లాలో 5,75,444 మందికి వ్యాక్సినేషన్ పూర్తి..
సంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 5,75,444 మందికి వ్యాక్సిన్ చేశామని కలెక్టర్ హనుమంతరావు.. సీఎస్కు వివరించారు. జిల్లాలో జూలై 1 నుంచి ఇప్పటివరకు 41,367 రాపిడ్ టెస్టులు, 8,158 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 40 ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లు ఉన్నాయని, వ్యాక్సినేషన్కు 14.5 లక్షల మంది జనాభా అర్హులని తెలిపారు. 60 ఏండ్లు దాటిన 69,353 మంది, 45 ఏండ్లు దాటిన 1,99,112 మంది, 18 ఏండ్లు దాటిన 2,77,187 మందికి వ్యాక్సినేషన్ వేస్తామని వివరించారు. జిల్లాలో 4,19,297 మందికి మొదటి డోస్, 1,56,147 మందికి సెకండ్ డోసులు పూర్తయ్యాయని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో 6 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, త్వరలో అవి అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు. జిల్లా దవాఖానలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో పూర్తి స్థాయిలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎస్కు వివరించారు. జిల్లాలోని ప్రతి ఆవాస ప్రాంతం, మున్సిపల్ పరిధిలో ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ పూర్తయిన ఇంటికి స్టిక్కర్ వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందరి సహకారంతో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను విజయవంతం చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో వరంగల్ జిల్లా నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, జిల్లా నుంచి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, అదనపు కలెక్టర్ రాజర్షి షా, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఏంహెచ్వో గాయత్రీదేవి, డీపీవో తదితరులు పాల్గొన్నారు.