నిరంతర విద్యుత్తో పరిశ్రమలకు కొత్త వెలుగులు
మూడు షిఫ్టులా పని.. పెరిగిన ఉత్పత్తి..లాభాల బాటలో పరిశ్రమలు
కార్మికులకు భారీగా బోనస్ ఇచ్చి సంతోషాన్ని నింపుతున్న యాజమాన్యాలు
గిఫ్ట్లు అందజేసిన పలు పరిశ్రమలు పారిశ్రామికవాడల్లో కార్మికుల ఆనందం
ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్న కార్మిక లోకం
నేడు పరిశ్రమల్లో విజయదశమి వేడుకలు
నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అండగా ఉంటుండడంతో పరిశ్రమలు భారీగా ఉత్పత్తులు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దసరా పండుగకు కార్మికులకు భారీగా బోనస్లు ప్రకటిస్తున్నాయి. ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో 24 గంటల కరెంట్ సరఫరాతో పరిశ్రమల్లో మూడు షిప్టులు నడుస్తున్నాయి. దీంతో కార్మికులకు ఉపాధి దొరుకుతున్నది. పారిశ్రామికవేత్తలు భారీగా ఉత్పత్తులు చేస్తూ ఎగుమతి చేస్తున్నారు. చాలా పరిశ్రమలు లాభాలను కండ్ల చూస్తుండడంతో విజయదశమి సందర్భంగా కార్మికులు, ఉద్యోగులకు సంతృప్తికరమైన స్థాయిలో బోనస్ ప్రకటిస్తున్నాయి. దీంతో సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక వాడల్లోని కార్మికుల్లో ఆనందం నెలకొన్నది. ఇప్పటికే సగానికి పైగా కంపెనీలు బోనస్ ప్రకటించాయి. కనిష్టంగా రూ. 8వేల నుంచి గరిష్టంగా రూ. 70వేల వరకు బోనస్ ఇస్తున్నాయి. కార్మిక చట్టాల ప్రకారం 8.33 శాతానికి తక్కువ కాకుండా, 10మందికి పైగా పనిచేసే సంస్థలు, పరిశ్రమలు తప్పక బోనస్ ప్రకటించాల్సి ఉంటుంది. కాగా, కొన్ని కంపెనీలు దీనికంటే ఎక్కువ కూడా బోనస్ ఇస్తున్నాయి. దీంతో కార్మికులు సంతోషంగా పండుగ షాపింగ్ చేస్తున్నారు.
పటాన్చెరు, అక్టోబర్ 13 : బోనస్ కాంతులతో పారిశ్రామికవాడలు జిగేల్ మంటున్నాయి. దసరా పం డుగ వస్తున్నదంటే కార్మికవాడల్లో పనిచేస్తున్న కార్మికుల్లో ఒకటే చర్చ ఉంటుంది. ఏడాదికాలంగా తాము పనిచేసినందుకు యాజమాన్యం ఎంతిస్తుందని, యూనియన్ నాయకులు పరిశ్రమ ప్రతినిధులతో, యాజమాన్యాలతో కార్మికుల కోసం బోనస్లు డిమాండ్ చేయ డం, చర్చలు జరిగాక ఒక ఒప్పందం చేసుకుని బోనస్ ప్రకటిస్తారు. పరిశ్రమల లాభాలను బట్టి సంస్థలు బోనస్ ప్రకటిస్తుంటాయి. తెలంగాణ సర్కారు నిరంతరం నాణ్యమైన విద్యుత్ను అందజేస్తుండడంతో పరిశ్రమలకు కొత్త జవసత్వాలు వచ్చాయి. ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో 24 గంటల కరెంట్ సరఫరాతో పరిశ్రమల్లో మూడు షిప్టులు నడుస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు కోరుకున్న స్థాయిలో ఉత్పత్తులు జరుగుతున్నాయి. చాలా పరిశ్రమలు లాభాలను కళ్ల చూస్తుండడంతో విజయదశమి సందర్భంగా కార్మికులు, ఉద్యోగులకు సంతృప్తికరమైన స్థాయిలో బోనస్ ప్రకటిస్తున్నాయి. దసరా వేడుకలకు బోనస్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుండడంతో కార్మికుల ముఖాల్లో ఆనందం కనిపిస్తున్నది. సగానికి పైగా కంపెనీలు బోనస్లు ప్రకటించాయి. బోనస్లతో ఆర్థిక అవసరా లు తీర్చుకునేందుకు, పండుగ కొనుగోళ్లు చేసుకునేందుకు కార్మికులు ఉత్సాహం చూపుతున్నారు. కనిష్టంగా రూ.8 వేల నుంచి గరిష్టం గా రూ.70 వేల వరకు బోనస్ అందుకుంటున్నారు.
మూడు నెలల నుంచే చర్చలు…
విజయదశమి పండుగ వస్తున్నదంటేనే కార్మికుల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. మూడు నెలల ముందు నుంచే క్యాంటీన్లలో చర్చలు కొనసాగుతాయి. ఈ మారు బోనస్ ఇంత కావాలనే డిమాండ్లు ఊపందుకుంటాయి. పరిశ్రమల పనితీరు, లాభనష్టాలను బట్టి యాజమాన్యాలు బోనస్ ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. యూనియన్ నాయకులు పరిశ్రమల యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి కార్మికులకు లాభం చేకూర్చేలా బోనస్ను సాధిస్తారు. కార్మిక చట్టాల ప్రకారం 8.33 శాతానికి తక్కువ కాకుండా పరిశ్రమలు బోనస్ ప్రకటించాలి. 10మందికి పైగా పనిచేసే సంస్థలు, పరిశ్రమలు బోనస్ ప్రకటించాల్సి ఉంటుంది. 8.33 శాతం కంటే ఎక్కువ కూడా ప్రకటించవచ్చు. గరిష్టంగా 20 శాతం వరకు బోనస్ను పరిశ్రమలు ప్రకటించడం కనిపిస్తున్నది. కార్మిక చట్టాల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఏడాదిపాటు పనిచేసిన కార్మికుడికి యాజమాన్యాలు బోనస్ ప్రకటించాలి. ఈ ఏడాది అధికశాతం పరిశ్రమలు దసరాకే బోనస్ ప్రకటించాయి. నవంబర్ నెలాఖరు వరకు బోనస్ను పరిశ్రమలు ప్రకటించాల్సి ఉంటుంది. దీపావళి పండుగ సందర్భంగానూ కొన్ని పరిశ్రమలు బోనస్ ఇస్తాయి.
రూ.60 వేల వరకు బోనస్..
పటాన్చెరులోని ఓ ప్రముఖ పరిశ్రమ రూ.60 వేల వరకు బోనస్ ప్రకటించింది. సదరు పరిశ్రమలో ఉత్పత్తి పెరిగి లాభాలు రావడంతో కార్మికుల పంట పండింది. భారీగా బోనస్ వస్తుండడంతో ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. బొల్లారం, గడ్డపోతారం, పాశమైలారం, పటాన్చెరు, రామచంద్రాపురం, రుద్రారం, కాజీపల్లి, గుమ్మడిదలలోని పారిశ్రామికవాడల్లో వందలాది పరిశ్రమలున్నాయి. ఇక్కడ జనాభాలో సగానికిపైగా కార్మికులు ఉండడంతో బోనస్లు ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తాయి. దసరా పెద్ద పండుగ కావడంతో కార్మికులు పండుగకు ఇచ్చే బోనస్లపై పెద్ద ఆశలే పెట్టుకుంటారు. బీహెచ్ఈఎల్, బీడీఎల్ వంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు రెడ్డిస్ ల్యాబ్స్, ఎంఎస్ఎన్, అరబిందో, న్యూలాండ్, తోషీబా, కిర్బి, ఏషియన్ పెయింట్స్, టర్బోటెక్, ఇంపీరియల్ గార్డెన్, ఫెన్నార్, ఫరేక్ ప్లాస్ట్స్, బీఈ, మైలాన్ వంటి ప్రముఖ పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. అధికంగా ఫార్మా, బల్క్డ్రగ్, ఇంజినీరింగ్ పరిశ్రమలు ఉన్నాయి. అధిక శాతం పరిశ్రమలు 10శాతానికి పైనే బోనస్ ప్రకటించాయి. యావరేజ్గా రూ.20 వేల బోనస్ సర్వత్రా కనిపిస్తున్నది. పలు పరిశ్రమలో ఒక నెలజీతం అదనంగా బోనస్ రూపంలో కార్మికులకు చెల్లిస్తున్నారు. బోనస్తో పాటు కొన్ని పరిశ్రమలు గిఫ్ట్స్ ఇస్తున్నాయి. కొన్ని పరిశ్రమలు నష్టాల్లో ఉండడంతో ఆ పరిశ్రమలు ఏ స్థాయిలో బోనస్ ఇస్తాయోనని కార్మికులు ఎదురు చూస్తున్నారు. బోనస్ చట్టాల ప్రకారం ఏడాది జీతం గుణించి 8.33 శాతం ఇవ్వాల్సి ఉంటుంది.