నారాయణఖేడ్, జూలై 12:నారాయణఖేడ్ పట్టణంలోని ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించి అందుకనుగుణంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మహారెడ్డి తెలిపారు. సోమవారం నారాయణఖేడ్ పట్టణంలోని కాశీవిశ్వనాథస్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన సందర్భంగా మాట్లాడారు. అతి పురాతనమైన కాశీవిశ్వనాథస్వామి ఆలయంతో పాటు రామాలయ ఆదాయాన్ని పెంచి తద్వారా ఆలయాలను అభివృద్ధి చేస్తామని, ఈమేరకు దేవాదాయశాఖ అధికారులతో చర్చించానన్నారు. కరస్గుత్తి రోడ్డు ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న కాశీవిశ్వనాథస్వామి ఆలయ భూములను వినియోగంలోకి తెచ్చి వ్యాపారాలను కొనసాగించుకునేందుకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆలయానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుందన్నారు. ఇటీవల రామాలయం, కాశీవిశ్వనాథస్వామి ఆలయ భూములను దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కౌలుకు ఇవ్వడం ద్వారా కొంత ఆదాయం సమకూరిందన్నారు. ఎంతో చరిత్ర కలిగిన పట్టణంలోని ఆలయాలను పరిరక్షించుకునే విషయంలో ప్రజలు ముందుకు వచ్చి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో రామాలయ కమిటీ చైర్మన్ ముత్యపు హన్మాండ్లు, కాశీవిశ్వనాథస్వామి ఆలయ ధర్మకర్త హన్మాండ్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దాలి
నారాయణఖేడ్ను పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దడంలో పారిశుధ్య కార్మికులు బాధ్యతాయుతంగా పని చేయాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి సూచించారు. సోమవారం నారాయణఖేడ్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందికి రగ్గులు పంపిణీ చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజావసరాలను గుర్తించి పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి లైట్ల క్రమబద్ధీకరణ వంటి పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలన్నారు. మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి ప్రజలు సహకరించి ఎవరికివారు పరిశుభ్రత పాటించాలన్నారు. మున్సిపల్ ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా మరిన్ని అభివృద్ధి పనులు చేసే అవకాశముంటుందనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పి పన్ను వసూళ్లు చేయాలన్నారు. రూ.11 కోట్ల నిధులతో ఆయా కాలనీల్లో సీసీ రోడ్లు, మురికి కాల్వలు నిర్మించామని, అవకాశమున్న మేరకు నిధులు తెచ్చి నారాయణఖేడ్ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తానన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ ఎం.ఏ.నజీబ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.