సంగారెడ్డి, జూలై 11 (నమస్తే తెలంగాణ) :పల్లె ప్రగతి కార్యక్రమం పల్లెకు కొత్త రూపు తెస్తున్నది. ప్రజలకు మౌలిక సౌలతులు చేరువవుతుండగా, ఎన్నో ఏండ్లుగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తున్నది. కాగా, ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకొని సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామంప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనంతో పాటు గ్రామంలో నిర్మించిన నాలుగు పార్కులు పల్లెవాసులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సమష్టి కృషితో గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రల్లెప్రగతితో గ్రామాలన్నీ సరికొత్త శోభను సంతరించుకున్నాయి. పట్టణాల్లో మాత్రమే కనిపించే పార్కులు నేడు.. పల్లె ముంగిటకు చేరాయి. ఇందుకు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. పల్లె ప్రగతిలో భాగంగా నిర్మించిన నాలుగు పార్కులు పల్లెవాసులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. రెండు వేల జనాభా ఉన్న మల్లేపల్లి గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతి నెలా వచ్చే ప్రభుత్వ నిధులను అభివృద్ధ్ది పనుల కోసం ప్రణాళిక ప్రకారం వినియోగిస్తున్న పంచాయతీ పాలక వర్గం గ్రామస్తుల మెప్పును పొందుతున్నది. ప్రజాప్రతినిధులు, అధికారుల సమషి కృషితో గ్రామాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి వీధిలో సీసీరోడ్లతో పాటు మురికి నీరు ప్రవహించకుండా డ్రైనేజీలను నిర్మించారు.
కొన్ని వాడల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయి. గ్రామంలో నర్సరీ, డంపింగ్యార్డు, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామాన్ని నిర్మించారు. వైకుంఠధామంలో ఏర్పాటు చేసిన శివుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. గ్రామం ఆరంభం నుంచే రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన పచ్చని చెట్లు స్వాగతం పలుకుతాయి. ప్రస్తుతం నాల్గో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం చురుగ్గా సాగుతున్నది. నర్సరీలో పదివేల మొక్కలు అందుబాటులో ఉండగా.. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు చొప్పున గ్రామస్తులకు అందజేసి ఇంటి ఆవరణలో నాటేలా చర్యలు తీసుకుంటున్నారు. అర ఎరకానికి పైగా ప్రభుత్వ స్థలంలో ఔషధ పార్కును ఏర్పాటు చేశారు. గ్రామంలోని పెద్దలు, చిన్నారులు సాయంత్రం వేళ పార్కులో సేద తీరుతున్నారు. గ్రామంలో పదిశాతం పంచాయతీ పేరిట రిజిష్టర్ చేసిన స్థలంలో సర్పంచ్ శివలీల జగదీశ్వర్ అన్ని సౌకర్యాలతో పార్కు, చిన్నపిల్లలు ఆడుకునేందుకు చిల్డ్రన్ పార్కును ఏర్పాటు చేశారు.
దీంతో గ్రామంలో పల్లె ప్రకృతివనంతో కలిసి మూడు పార్కులు, ఒక ఔషధ పార్కుతో మొత్తం గ్రామంలో నాలుగు పార్కులు ఉండడంతో మల్లేపల్లి గ్రామం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. మల్లేపల్లి గ్రామం మోడల్గా ఇతర గ్రామాల్లోని సర్పంచ్లు పార్కులు అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారు. గ్రామంలో తాగునీటి సరఫరా కోసం ప్రభుత్వం నాలుగు ట్యాంకులను నిర్మించడంతో ప్రతి రోజూ ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. బీసీ కాలనీలో రూ.45 లక్షలతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టారు. రూ.20లక్షలతో బీసీ కాలనీలో సీసీరోడ్లు నిర్మించారు. ఎస్సీ కాలనీలో రూ.25 లక్షలతో సీసీ డ్రైన్లు నిర్మిస్తున్నారు.
అన్నింటా అభివృద్ధి..
సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలు అన్నింటా అభివృద్ధ్ది చెందుతున్నాయి. మా గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన నిధులతో అభివృద్ధ్ది పనులు చేపడుతున్నాం. గ్రామంలో పూర్తిగా సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మించాం. గ్రామంలో ఎక్కడా పారిశుధ్య సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. పల్లె ప్రగతిలో భాగంగా ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేస్తున్నాం. గ్రామంలో డంపింగ్యార్డు, వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేసుకున్నాం. చిల్డ్రన్ పార్కుతో పాటు ప్రత్యేకంగా ఔషధ పార్కు ఏర్పాటు చేశాం.
పారిశుధ్యం,హరితహారానికి ప్రాధాన్యం..
గ్రామంలో నాల్గో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం కొనసాగుతున్నది. ప్రభుత్వం సూచించిన విధంగా వైకుంఠధామం, డంపింగ్యార్డు, పల్లె ప్రకృతివనాలను ఏర్పాటు చేశాం. పల్లె ప్రగతిలో భాగంగా శిథిలావస్థకు చేరుకున్న 12 ఇండ్లు, నాలుగు బావులను పూడ్చివేశాం. గ్రామ నర్సరీలో పదివేల మొక్కలు పెంచాం. ప్రస్తుతం ఇంటింటికీ ఆరు మొక్కలను పంపిణీ చేస్తున్నాం.