సంగారెడ్డి, జూలై 5 (నమస్తే తెలంగాణ) : గ్రామాల్లో ప్రమాదకరంగా మారిన బావులు, బోరుబావులను పల్లె ప్రగతిలో పూడ్చివేస్తున్నారు. గ్రామాల్లో గతంలో తాగునీరు, సాగునీటి అవసరాల కోసం బావులు తవ్వేవారు. తాగునీటి అవసరాల కోసం వివిధ వాడల్లో చేదబావులు ఉండేవి. గ్రామాల్లో ఉండే చేదబావులు, మోటబావులు కాలక్రమంలో పూడుకుపోయాయి. చాలాచోట్ల బావులు కూలిపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న ఈ బావుల్లో ప్రమాదవశాత్తు పిల్లలు, పెద్దలు పడిపోయి ప్రమాదాలు చోటు చేసుకునేవి. కొన్ని సందర్భాల్లో పశువులు పడి మృతి చెందేవి. ప్రమాదకరంగా మారిన ఈ బావులను పూడ్చివేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం. దీంతో ప్రజలు సమైక్య ప్రభుత్వాలకు ఎన్ని సార్లు మొరపుట్టుకున్నా స్పందించలేదు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ‘పల్లెప్రగతి’కి శ్రీకారం చుట్టారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన చేదబావులు, మోట బావులను పూడ్చివేసేందుకు అనుమతించారు.
దీంతో పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లోని శిథిలావస్థకు చేరుకున్న, వినియోగంలోలేని బావులను గుర్తించి వాటిని పంచాయతీ సిబ్బంది పూడ్చివేయడం జరుగుతుంది. అధికారుల సమాచారం మేరకు మూడు విడుతలుగా జిల్లాలో 1500కుపైగా బోరుబావులను పూడ్చివేశారు. తాజాగా జిల్లాలోని నాల్గో విడుత ‘పల్లెప్రగతి’ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని పంచాయతీల్లో శిథిలావస్థకు, వినియోగంలోలేని బావులను పంచాయతీ సిబ్బంది గుర్తించారు. జిల్లాలోని 647 పంచాయతీల్లో 393 శిథిలావస్థకు చేరిన, వినియోగంలోని బావులను పంచాయతీ సిబ్బంది గుర్తించారు. అందోల్ మండలంలో 26, గుమ్మడిదలలో 13, హత్నూరలో 25, ఝరాసంగంలో 16, జిన్నారంలో ఐదు శిథిలావస్థకు చేరుకున్న బావులను గుర్తించారు. కల్హేర్ మండలంలో 24, కందిలో ఐదు, కంగ్గిలో నాలుగు, కోహీర్లో 13, కొండాపూర్లో తొమ్మిది, మనూరులో ఏడు శిథిలావస్థకు చేరుకున్న బావులను గుర్తించారు.
అలాగే మొగుడంపల్లి మండలంలో 22, మునిపల్లిలో 12, నాగల్గిద్దలో 14, నారాయణఖేడ్లో 29, న్యాల్కల్లో 43, పటాన్చెరులో ఏడు, పుల్క్లో 23, రాయికోడ్లో 10, సదాశివపేటలో 25, సంగారెడ్డిలో నాలుగు, సిర్గాపూర్లో 16, వట్పల్లిలో 12, జహీరాబాద్లో 30 శిథిలావస్థకు చేరుకున్న బావులను గుర్తించారు. పల్లెప్రగతిలో భాగంగా ఐదు రోజులుగా గ్రామాల్లో గుర్తించి శిథిలావస్థకు చేరుకున్న, వినియోగంలో లేని బావులను పూడ్చివేస్తున్నారు. 393 బావులకుగానూ ఇప్పటి వరకు 139 బావులను పూడ్చివేశారు. మిగతా 374 బావులను పూడ్చివేసే ప్రక్రియ కొనసాగుతున్నది. పల్లె ప్రగతి ముగిసేలోగా శిథిలావస్థకు చేరుకున్న బావులను పూర్తిస్థాయిలో పూడ్చివేయనున్నట్లు పంచాయతీ అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో ప్రమాదకరంగా మారిన శిథిలమైన బావులను పూడ్చివేయడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే శిథిలావస్థకు చేరుకున్న బావులతోపాటు ప్రమాదకరంగా మారిన బోరుబావులను సైతం పల్లె ప్రగతిలో మూసివేస్తున్నారు.
జిల్లాలోని 647 పంచాయతీల్లో 221 బోరుబావులు వినియోగంలో లేనట్లు పంచాయతీ అధికారులు గుర్తించారు. ఈ బోరుబావులను పల్లెప్రగతిలో భాగంగా మూసివేస్తున్నారు. వినియోగంలో లేని బోరుబావులను తెరిచి ఉండడంతో చిన్నపిల్లలు అందులో పడిపోయే ప్రమాదం ఉంది. జిల్లాలో గతంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగంలో లేని తెరిచిఉన్న బోరుబావులను అధికారులు పల్లె ప్రగతిలో పూడ్చివేస్తున్నారు. న్యాల్కల్ మండలంలో అత్యదికంగా 22 బోరుబావులు వినియోగం లేవు. రాయికోడ్ మండలంలో 21, ఝరాసంగంలో 16, అందోల్లో 13, మొగుడంపల్లిలో 14, జహీరాబాద్లో 13, సిర్గాపూర్లో 12, సంగారెడ్డిలో 11 బోరుబావులు వినియోగంలో లేనట్లు గుర్తించారు. మిగతా మండలాల్లో ఐదు నుంచి పదిచొప్పున బోరుబావులు వినియోగంలో లేవు. జిల్లాలో మొత్తం 221 బోరుబావులు వినియోగంలోలేవు. వీటని పల్లె ప్రగతిలో పూర్తిగా మూసివేయనున్నారు. ఇప్పటి వరకు 130 బోరుబావులను పూడ్చారు. రాబోయే ఐదు రోజుల్లో మిగతా బావులను పూడ్చివేయనున్నారు. బోరుబావులను మూసివేయటం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాల్గో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాలు మెదక్ జిల్లాలో జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లాలో పల్లె ప్రగతిని విజయవంతం చేయడానికి అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు తీవ్రం గా కృషి చేస్తున్నారు. అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, రైతువేదికలు, హరితహారం కింద మొక్కలు నాటడం, ఇంటింటికీ చెత్త సేకరణ, ట్రాక్టర్లు, ట్రాలీల కొనుగోలు దాదాపుగా పూర్తయ్యాయి. ఇంటింటికీ చెత్త సేకరణ, చెత్తను వేరు చేయడం, ఎరువుగా మార్చడం లాంటివి అమలులో మెదక్ జిల్లా ముందుంది.
శిథిలావస్థలో ఉన్న భవనాలు కూల్చివేత..
మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీల్లో పల్లెప్రగతి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1080 శిథిలావస్థలో ఉన్న భవనాలను జేసీబీలతో కూల్చివేశారు. అంతేకాకుండా రోడ్డుకు ఇరువైపులా ఉన్న 959 గుంతలను పూడ్చివేశారు.