మనోహరాబాద్: ప్రత్యేక రాష్ట్రంలోనే తెలంగాణ యాస, భాషకు గుర్తింపు వచ్చిందని, గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. శివ్వంపేట మండలం శభాష్పల్లిలో బతుకమ్మ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… అరవై ఏండ్ల ఆంధ్రపాలకుల చేతిలో తెలంగాణ అణిచివేతకు గురైందన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో జరిగిన ఉద్యమంతో ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ నేడు అన్ని రంగాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.
మన యాస, మన భాషలకు నేడు ప్రపంచం నలుమూలల గుర్తింపు వచ్చిందన్నారు. బతుకమ్మ పండుగను విదేశాల్లో సైతం గౌరవంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, మండల అధ్యక్షుడు రాజరమణాగౌడ్, సర్పంచ్లు రంగపల్లి పార్వతిసత్యం ముదిరాజ్, మాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.