సంగారెడ్డి/మెదక్, జనవరి 31(నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షిషాను మంగళవారం ప్రభుత్వం నియమించింది. సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్(లోకల్బాడీ)గా ఉన్న రాజర్షిషా 2017 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. 10 ఫిబవ్రరి 2020లో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్గా విధుల్లో చేరారు. రెండున్నరేళ్లకు పైగా సంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకున్నా రు. వైకుంఠధామాల నిర్మాణంలో సంగారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచేందుకు కృషిచేశారు. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు, క్రీడా మైదానాలు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందేలా కృషిచేశారు. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన రాజర్షిషా కాన్పూర్ ఐఐటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. మొదట ఐఆర్ఎస్ ఆఫీసర్గా పనిచేసిన రాజర్షిషా, 2017లో ఐఏఎస్కు ఎంపికయ్యారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో అదనపు కలెక్టర్గా విధులు నిర్వర్తించారు. ఆయన సతీమణి నితిక పంత్ ఐపీఎస్ ఆఫీసర్. ఆమె సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీగా కొంతకాలం పనిచేశారు.
మెతుకు సీమపై తనదైన ముద్రవేసిన కలెక్టర్ హరీశ్…
మెదక్ జిల్లా కొత్తగా ఏర్పాటైన తర్వాత కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఎస్.హరీశ్ మెతుకు సీమపై తనదైన ముద్ర వేశారు. ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు చేయడంతో పాటు విద్య, అభివృద్ధి, సంక్షేమం, పారిశుధ్యం, ధరణి అమలులో జిల్లాకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చారు. మెదక్ కలెక్టర్గా ఆయన ఫిబ్రవరి 8, 2021న బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందారు. జిల్లాలో చోటు చేసుకున్న ఎన్నో కీలక పరిణామాల్లో సత్వరం స్పందించి శభాష్ అనిపించుకున్నారు. 24 నెలల ఆయన ఉద్యోగ కాలంలో జిల్లాను అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నిలపేందుకు విశేషంగా కృషిచేశారు. మెదక్ నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. జిల్లాకేంద్రంలో రూ.8 కోట్లతో ఇందిరాగాంధీ స్టేడియంలో పనులు పూర్తి చేయించారు. గ్రామ పంచాయతీల్లో పాలన పక్కాగా సాగేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించేందుకు ప్రాధాన్యమిచ్చారు. ధాన్యం సేకరణ, రైతులకు డబ్బుల చెల్లింపు విషయంలో ఆయన చురుకుగా వ్యవహరించి ఇబ్బందులు ఎదురుకాకుండా చూశారు. మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేట గ్రామాల శివారులో ఈటల రాజేందర్ భూముల వ్యవహారంలో నిష్పక్షపాతంగా వ్యవహరించి పేదలకు పట్టాలు ఇప్పించారు.