న్యాల్కల్, ఫిబ్రవరి 2: జిల్లాలో పేరుగాంచిన హజ్రత్ పీర్ గైబ్ సాహెబ్ ఖిబ్లా దర్గాను కులమతాలకు అతీతంగా వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రానికి రెండు కిలోమీర్ల దూరంలో ఈ దర్గా ఉంది. ఈ నెల 3 (నేడు) నుంచి 10వ తేదీ వరకు దర్గా ఉర్సు నిర్వహించనున్నారు. ఏటా పెద్ద ఎత్తున నిర్వహించే ఈ దర్గా ఉర్సులో జిల్లావాసులే కాక కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉర్సు నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో పలు వసతులు ఏర్పాటు చేశారు. ఈ ఉర్సు ప్రారంభం రోజు మండల కేంద్రమైన న్యాల్కల్ గ్రామానికి చెందిన మాలి పటేల్ ఇంటి నుంచి దర్గా వరకు సర్కారీ సంధాల్ (గంధం) ఊరేగింపు నిర్వహిస్తారు. 4న కూరగాయల సంత కొనసాగుతుంది. అదేరోజు రాయికోడ్, న్యాల్కల్, ఝరాసంగం మండలాల నుంచి దర్గాకు సంధాల్ ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయి.
5న పశువుల సంత, గ్రామానికి చెందిన అడివప్ప, గిరిజల జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు ఉత్తమ పశు పోషణదారులకు బహుమతులు ప్రదానం చేస్తారు. అదేరోజు హద్నూర్ గ్రామం నుంచి గంధం ఊరేగింపు నిర్వహిస్తారు. 6న న్యాల్కల్ గ్రామానికి చెందిన ఖురేషీల ఆధ్వర్యంలో గంధం ఊరేగింపు ఉంటుంది. 7న అంతర్ రాష్ట్ర కుస్తీ పోటీలు కొనసాగుతాయి. 8న కూరగాయల సంత, 9 దర్గా ఆవరణలో ఖవ్వాలీ ఏర్పాటు చేయనున్నారు. 10న ఉర్సు ముగింపు కార్యక్రమం నిర్వహిస్తారు. జహీరాబాద్ డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో జహీరాబాద్ రూరల్ సీఐ వెంకటేశ్, హద్నూర్ ఎస్సై వినయ్కుమార్ పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
ఉర్సులో భాగంగా ఏడాదికోసారి ఈ దర్గా వద్ద అతి పెద్ద ఎడ్ల అంగడి జరుగుతుంది. ఈ అంగడికి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి పశువులను భారీ ఎత్తున తరలిస్తారు. పశువులను చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తారు. ఎద్దులు, కోడె దూడలు, ఆవులు, పాడి గేదెల క్రయవిక్రయం జోరుగా సాగుతుంది. అంతర్ రాష్ట్ర కుస్తీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతాయి. ఆయా రాష్ర్టాల మల్లయోధులు తలపడే ఈ పోటీలను తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తారు.