పెద్దశంకరంపేట : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం ఐకేపీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని భూర్గుపల్లి, జూకల్ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.
మార్కెటింగ్ సమస్య రావొద్దనే ఉద్దేశంతో గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటుందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించెందుకు ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. రైతు సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మురళీపంతులు, మండల రైతుబంధు అధ్యక్షులు సురేష్గౌడ్, సర్పంచ్లు జగన్మోహన్రెడ్డి, సరిత, ఏపీఎం గోపాల్, తదితరులున్నారు.