మెదక్ మున్సిపాలిటీ: ప్లాస్టిక్ రక్కసితో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతొంది. ఏక కాలంలో వినియోగించి పారేసే వ్యర్థాలతో జీవరాశులుకు నష్టం కలుగుతోంది. వాడుతున్న ప్లాస్టిక్లో 9 శాతం రీసైక్లింగ్ అవుతుండగా 12 శాతం కాల్చేస్తున్నారు. మిగిలిన 79 శాతం భూమి పొరల్లోకి వెళ్తోంది. పర్యావరణానికి హానికరంగా మారిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై వచ్చే ఏడాది జూలై లోగా నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ఈ నెల 13న ప్రకటించింది. 2022 డిసెంబర్ నుంచి 120 మైక్రాన్ల కంటె ఎక్కువ పరిమాణంలో గల వాటినే వాడాలని సూచించింది.
ప్లాస్టిక్ను శాశ్వతంగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ప్లాస్టిక్ కవర్లు, వస్తువులతో కలుగుతున్న పర్యావరణ దుష్పరిణామాల నేపథ్యంలో వచ్చే ఏడాది జూలై నుంచి పూర్తిగా వాడకుండా చేసేందుకు సిద్ధమవుతుంది. మున్సిపాలిటీలు సైతం ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తున్న ప్రమాణాలకు అనుగుణంగా మార్కెట్లో ప్లాస్టిక్ కవర్లు కనిపించకుండా కఠిన చర్యలు తీసుకోవడానికి సన్నద్దమవుతున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాల్టీలు ఉండగా వీటి పరిధిలో ప్రతి రోజు వందలాది మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది.. ఈ చెత్తలో 20 శాతం మేరకు ప్లాస్టిక్ కవర్లు, సంచులు, ప్లాస్టిక్ వస్తువులే ఉంటున్నాయి. వాస్తవానికి ప్లాస్టిక్ సంచులు, వస్తువులపై నిషేధానికి ఉమ్మడి రాష్ట్రంలో 2013 జూన్ 20న జీవో అమల్లోకి వచ్చింది. అప్పట్లో మున్సిపాలిటీలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి ర్యాలీలు, అవగాహన ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపాలిటీల్లోని పారిశుధ్య విభాగాల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి వ్యాపారులకు జరిమానాలు సైతం విధించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2016 డిసెంబర్ 30న మళ్లీ జీవో 79 అమలు చేశారు. మున్సిపల్ అధికారులు ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు విక్రయించే హోల్సెల్ వ్యాపారులపై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకోని జరిమానాలు విధించారు. ఈ మధ్య కాలంలో కరోనా కారణంగా దాడులు లేకపోవడంతో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైంది. ప్రస్తుతం కేంద్రం తాజా ఉత్తర్వులు వెలువరించడంతో మున్సిపల్ అధికారులు పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించేందుకు సన్నద్దమవుతున్నారు. అంతకంటే ముందు వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేసి మరోమారు అవగాహన కల్పిస్తామని చెబుతున్నారు.
తాజా నిబంధనలు ఇవే..
పర్యావరణ పరిరక్షణ చట్టం-1986లోని ప్లాస్టిక్ వ్యర్థాలపై 2016లో సవరించిన నిబంధనల ఆధారంగా 50 మైక్రాన్ల కంటే తక్కున పరిమాణం కలిగిన ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధాజ్ఞలు ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి 75 మైక్రాన్లు ఉన్నవాటిని, వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి 120 మైక్రాన్ల మందం వాటినే వినియోగించాలని తాజాగా కేంద్రం స్పష్టం చేసింది.