చిలిపిచెడ్, ఏప్రిల్ 24 : కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తున్నదని జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్ శంకర్ అన్నారు. శనివారం మండలంలోని చండూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యంలో తాలు, మట్టి, పొలు లేకుండా కొనుగోలు కేం ద్రాలకు తీసుకు రావాలన్నారు. తేమ 17 శాతం కంటే తక్కువ ఉండే విధంగా చూడాలన్నారు. ధాన్యాన్ని క్లీనర్ మిషన్లలో పోయాలన్నారు. లారీల కొరత లేకుండా ముందు చర్యలు తీసుకున్నామన్నారు. రైతులు ధాన్యాన్ని అమ్మిన వెంటనే పట్టాపాసుపుస్తకం, ఆధార్కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవ్వాలన్నారు. ఆయన వెంట సొసైటీ సీఈవో పోచయ్య, డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి ఉన్నారు.
తూప్రాన్ రూరల్, ఏప్రిల్ 24 : రైతులు ఇబ్బందులు పడకుండా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతాంగాన్ని ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతున్నదని ఎంపీపీ గడ్డిస్వప్న అన్నారు. మండలంలోని యావాపూర్, ఘనపూర్ గ్రామాల్లో జడ్పీటీసీ రాణిసత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాబుల్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ దీపక్రెడ్డితో కలిసి శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు సరైన మద్దుతు ధరను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. 72 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సంతోశ్రెడ్డి, సర్పంచ్లు నర్సింహారెడ్డి, పుష్పనవీన్, ఉపసర్పంచ్లు లక్ష్మీస్వామి, ఆకులరవి, మండల వ్యవసాయశాఖ అధికారి నుస్రత్, ఏఈవోలు సంతోశ్, సింధూ, రైతులు తదితరులు పాల్గొన్నారు.
నిజాంపేట, ఏప్రిల్ 24 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సతీశ్ అన్నారు. శనివారం ఆయన నిజాంపేటలో సబ్ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. ధాన్యం తేమ 17 శాతం ఉండేట్లు ఆరబెట్టాలన్నారు. మాయిశ్చర్ యంత్రంతో ధాన్యం తేమ శాతా న్ని పరిశీలించారు. ఆయన వెంట ఏఈవో దివ్య, రైతులు ఉన్నారు.
నర్సాపూర్, ఏప్రిల్ 24 : మండలంలోని చిన్నచింతకుంట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో సర్పంచ్ సురేశ్గౌడ్ శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సురేశ్గౌడ్ మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. మంచి ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చి మద్దతు ధరను పొందాలని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నర్సింగరావు, వార్డు సభ్యులు, ఐకేపీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారురోడ్లపై ధాన్యం ఆరబెట్టొద్దు..
రామాయంపేట, ఏప్రిల్ 24 : రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దని ఎస్సై రమేశ్ హెచ్చరించారు. పట్టణ శివారులోని డీ.ధర్మారం, అక్కన్నపేట, కోనాపూర్, దామరచెర్వు శివారుల్లోని రోడ్లపై ధాన్యం ఆరబెట్టిన వారి వివరాలను సేకరించారు. రోడ్డుపై బైక్పై వెళ్లిన ఉపాధ్యాయుడి మృతికి కారణమైన వరికుప్పలను తీసివేయాలన్నారు. లేకపోతే రైతులందరినీ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి కేసులు నమోదు చేస్తామన్నారు. రోడ్లపై ఆరబోసిన ధాన్యాన్ని బస్తాల్లో నింపి తీసుకెళ్లారు. మరోసారి రోడ్లపై ధాన్యం కనబడితే కేసులు నమోదు చేస్తానని హెచ్చరిచారు.