మెదక్ మున్సిపాలిటీ: ఉపాద్యాయుల హేతుబద్దీకరణకు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో జిల్లాలో విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే యూడైస్ అన్లైన్ ప్రక్రియ ముగియ డంతో పాఠశాలల హేతుబద్దీకరణ పనులు మరింత వేగవంతం కానున్నాయి. యూడైస్ 2019-20 విద్యాసంవత్సరం గణాంకాలను పరిగణలోనకి తీసుకోవడం, కొవిడ్ నేపథ్యంలో హేతుబద్దీ కరణ వాయిదా పడుతూ వచ్చింది. కొద్దిరోజులుగా డీఈవో కార్యాలయంలో అధికారులు, ఉపాధ్యాయుల వివరాలను పాఠశాలల స్థాయి నుంచి సేకరించి మదింపు పనులు చేస్తున్నారు. వివరా లను క్రోడికరించిన అనంతరం ఉన్నాతాధికారులకు నివేదికను అందజేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
డేటా సమర్పించిన ఎంఈవోలు
విద్యాశాఖ పరిధిలోని తెలుగు, ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలను ఎంఈవోలు పరిశీలించి, పాఠశాలల్లోని సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్(ఎస్ఏ), ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎం) హోదాలకు అనుగుణంగా క్యాడర్ స్ట్రెంగ్త్, యూడైస్ ఎన్రోల్మెంట్లను డీఈవోకు అందజేశారు. కాగా గత విద్యాసంవత్సరం(2020-21) యూడైస్ విద్యార్థుల సంఖ్య ఆధారంగా చేపట్టనున్నారు. ఈ మేరకు ఈనెల 18వ తేదిన విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ జీవో నంబర్ 28ని జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో 150 కంటే విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న పాఠశాలలకే ప్రధానోపాద్యాయులు ఉంటారు.
19 మంది విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడు చోప్పున ఉండేలా ప్రతిపాదించారు. ఒకే బడి ఆవరణలో ప్రాథమిక, ప్రాథమికోన్నత లేదా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉంటే వాటిని విలీనం చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. అంతేగాకుండా ఉన్నత పాఠశాలల్లో తెలుగు మాధ్యామానికి సమాంతరంగా ఆంగ్ల మాధ్యమ సెక్షన్లు నడుస్తూ వాటిల్లో 50 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే ఆంగ్ల మాద్యమ విద్యార్థులను సమీపంలోని మరో బడిలో చేరుస్తారని మార్గదర్శకాల్లో పేర్కోన్నారు. ఏదేమైన జిల్లా విద్యాశాఖ చేస్తున్న ఈ కసరత్తు అనతరం పూర్తి వివరాలతో నివేదిక సిద్ధ మవుతుందని బావిస్తున్నారు.
ప్రవేశాలు పెరిగాయి..
కొవిడ్ నేపథ్యంలో ప్రత్యక్ష తరగతులు నిలిచి ఆన్లైన్ తరగతులు కొనసాగుతుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవల ప్రవేశాలు పెరిగాయి. అంగన్వాడీ కేంద్రాల నుంచి చిన్నారులు ప్రాథమిక పాఠశాలల్లో చేరుతుండటంతో ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గతంతో పోల్చుకుంటే అధికమైంది. దీంతో ప్రస్తుత హేతుబద్దీగరణలో ప్రాథమిక పాఠశాలల్లో పెద్ద మార్పులు ఉండక పోవచ్చని విద్యాశాఖ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. తక్కువమంది విద్యార్థులతో నెట్టుకోస్తున్న పాఠశాలల ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు భరోసా కల్పించి వారి ప్రవేశాలు కల్పించాల్సి వస్తుంది. దీనితో ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరే అవకాశంతో పాటు బలోపేతం కావడానికి వీలు కలుగుతుంది.
జిల్లాలో పాఠశాలలు, ఉపాధ్యాయుల వివరాలు ఇలా..
జిల్లాలో 924 పాఠశాలలు ఉండగా ఇందులో ప్రాథమిక పాఠశాలలు 129, ప్రాథమికోన్నత పాఠశాలలు 624, ఉన్నత పాఠశాలలు 159 ఉన్నాయి. వీటిలో పీజీ హెచ్ఎంలు 60, భాషా పండితులు 305, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు 60, స్కూల్ అసిస్టెంట్లు1157, పీఈటీలు 52, ఎస్జీటీలు 1860 మంది విధులు నిర్వహిస్తున్నారు.