Telangana Millet Man | జహీరాబాద్, మార్చి19: డీడీఎస్ డైరెక్టర్ పీవీ.సతీశ్ ఆదివారం తెల్లవారు జామున హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు చేసి దళిత మహిళలు, పేదలు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన స్వచ్ఛంద సంస్థలకు రాకముందు దూరదర్శన్లో పనిచేశారు. జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్లో డీడీఎస్ కార్యాలయం ఏర్పాటు చేసి జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, మొగుడంపల్లి, న్యాల్కల్, రాయికోడ్, మనూరు మండలాల్లో తమ కార్యక్రమాలు నిర్వహించారు.
నిరుపేద మహిళలకు అక్షరాస్యత కలిపించడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు సంఘాలు ఏర్పాటు చేశారు. ఎకరా, రెండు ఎకరాల వ్యవసాయ భూముల్లో చిరుధాన్యాలు సాగు చేసేందుకు ప్రోత్సహించారు. సేంద్రియ ఎరువులతో చిరుధాన్యాల సాగుకు కృషి చేశారు. ఝరాసంగం మండలంలోని మచునూరు గ్రామంలో పచ్చసాలే ఏర్పాటు చేసి చదువుతో పాటు కులవృతులపై శిక్షణ కలిపించారు. ప్రతి ఏడాది జనవరిలో పాత పంటల జాతర నిర్వహించి, వాటి సాగుపై అవగాహన కలిపించారు. చిరుధాన్యాల సాగుపై దేశ విదేశాల్లో నిర్వహించిన సదస్సుల్లో అవగాహన కల్పించారు. పస్తాపూర్లోని డీడీఎస్ కార్యాలయంలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు సోమవారం నిర్వహించేందుకు డీడీఎస్ సంస్థ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.
డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీవీ.సతీశ్ (77) మృతి బాధాకరమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. సతీశ్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. తెలంగాణ మిల్లెట్ మ్యాన్గా గుర్తింపు పొందిన సతీశ్ మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు.
– కుటుంబ సభ్యులకు మంత్రి హరీశ్రావు సంతాపం
పేద మహిళల సంక్షేమం కోసం ఎంతో కృషి చేసిన డీడీఎస్ డైరెక్టర్ సతీశ్ మృతి తీరని లోటని టీఎస్ఎంఎస్డీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. చిరుధాన్యాల సాగు, సేంద్రియ వ్యవసాయం పెంచేందుకు ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు.
– టీఎస్ఎంఎస్డీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్