ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. ఎమ్మెల్యే సహకారంతో హవేళీఘనపూర్ మండలం బ్యాతోల్ గ్రామ సర్పంచ్ శ్రీను ఆధ్వర్యంలో పల్లె ప్రగతి నిధులతో గ్రామం అభివృద్ధి దిశగా పయనిస్తున్నది. పార్కులను తలపించేలా పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్ నిర్మాణాలు పూర్తయ్యాయి. గ్రామంలోకి వెళ్లగానే హరితహారం మొక్కలు స్వాగతం పలుకుతాయి. గ్రామంలో ఎటుచూసినా పరిసరాల పరిశుభ్రత, మౌలిక వసతులతో ఆదర్శంగా కనిపిస్తున్నది. గ్రామంలో 1100 మంది జనాభా నివసిస్తుండగా.. ఇంటింటికీ మరుగుదొడ్లు, ప్రతి వీధికి సీసీరోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం చేపట్టారు. దీంతో గ్రామం అందంగా కన్పిస్తున్నది.
స్వచ్ఛ గ్రామంగా బ్యాతోల్..
పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో చెత్త సేకరణకు గాను పంచాయతీ ట్రాక్టర్ ప్రతి రోజూ గ్రామంలో పారిశుధ్య కార్మికులు ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తున్నారు. ఈ చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దీంతో గ్రామమంతా అందంగా కనిపిస్తున్నది. గ్రామ నడిబొడ్డున ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో రకరకాల మొక్కలను నాటారు. నిత్యం పంచాయతీ కార్మికులు మొక్కలకు నీరుపోస్తూ వాటిని సంరక్షిస్తున్నారు. దీంతో అవి ఏపుగా పెరగడంతో గ్రామస్తులు ప్రతి రోజు సాయంత్రం సమయంలో అక్కడి చేరుకుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటారు. అంతేకాకుండా ప్రకృతి వనంలో ప్రజలు ఉదయం వాకింగ్ చేసే విధంగా ట్రాక్ కూడా ఏర్పాటు చేశారు. మండల పరిధిలోని బ్యాతోల్ గ్రామ శివారులో బీసీ, ఎస్సీ కాలనీలో రోడ్ల గుంతలు పూడ్చడంతో పాటు నూతనంగా రోడ్లు చేపట్టి చెత్తాచెదారాన్ని తొలగించి గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చారు. గ్రామంలో 10 శిథిలావస్థకు చేరిన పాత ఇండ్లు, 4 పాడుపడిన బావులను పూడ్చివేశారు.
ఎమ్మెల్యే సహకారంతో మరింత అభివృద్ధి..
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ కృషితో ఇప్పటికే గ్రామంలో సీసీ, మురుగునీటి కాల్వల నిర్మాణం చేపట్టాం. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే సహకారంతో మరిన్ని నిధులు మంజూరు చేయించి గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం. ప్రజలు తమ ఇంటి పరిసరాలతో పాటు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు కృషి చేస్తున్నారు. గ్రామస్తులు చాలా బాగా సహకరిస్తున్నారు.
సుజాత, జడ్పీటీసీ
పల్లె ప్రగతితో ఎంతో మేలు..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గతంలో చేపట్టలేని ఎన్నో కార్యక్రమాలను ఇప్పుడు చేపట్టగలిగాం. ముఖ్యంగా ప్రజలు చెత్తను గతంలో ఎక్కడబడితే అక్కడ వేసేవారు. కానీ, ఇప్పుడు తడి, పొడి చెత్తను వేరు చేయడంతో పారిశుధ్య కార్మికులు ప్రతి రోజూ ఇంటింటికీ తిరుగుతూ చెత్తను సేకరిస్తున్నారు. సేకరించి చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాం. గ్రామ అభివృద్ధికి ప్రజలు మంచిగా సహకరిస్తున్నారు.
శ్రీనివాస్, సర్పంచ్