మెదక్ మున్సిపాలిటీ, జూన్ 24 : విద్యాసంస్థలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి కొవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేపట్టింది. మెదక్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు 3,454 మంది ఉండగా, బోధనేతర సిబ్బంది 170 మంది ఉన్నారు. వీరందరికీ ఈ నెల 29తేదీ లోపు వ్యాక్సిన్ పూర్తి చేయాలని ప్రభుత్వం వైద్యారోగ్య శాఖను ఆదేశించింది. నేటి నుంచి ఉపాధ్యాయులు విధులకు హాజరు కానున్నారు. జూలై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపాధ్యాయులతోపాటు బోధనేతల సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. మెదక్ జిల్లాలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు మెదక్ డీఈవో రమేశ్ తెలిపారు.
ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్
సిద్దిపేట అర్బన్, జూన్ 24 : జూలై 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ, పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం గురువారం ప్రారంభమైందని సిద్దిపేట డీఈవో రవికాంతరావు తెలిపారు. జిల్లాలోని 35 సెంటర్లలో ఉపాధ్యాయులకు కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వగా, ప్రతి సెంటర్ ఒక ఇన్ జిల్లా విద్యాశాఖ అధికారులు నియమించారు. గురువారం మొదటి రోజు 35 సెంటర్లలో 451 మంది ఉపాధ్యాయులు కొవిడ్ టీకాలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు 182 మంది ఉండగా, 43 మంది ప్రభుత్వ పాఠశాలల్లోని నాన్ టీచింగ్ స్టాఫ్, 177 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు, 26 మంది ప్రైవేట్ నాన్ టీచింగ్ స్టాఫ్ పాటు 23 మంది హాస్టల్ స్టాఫ్ ఉన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు జిల్లాలోని 100 శాతం మంది ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ వేయించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.