చేగుంట, జూన్6: రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన నార్సింగి మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. నార్సింగి పోలీసుల కథనం ప్రకారం.. చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామానికి చెందిన ర్యాల సిద్ధిరాములు(45) గొర్ల కాపరి. మిర్జాపల్లి నుంచి నార్సింగికి తన మోటారు వాహనంలో పెట్రోల్ పోసుకోవడానికి వెళ్లి, తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో సిద్ధిరాములు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మీ, ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై న ర్సింహులు తెలిపారు.
చేగుంటలో ఒకరు..
గుర్తు తెలియని వాహ నం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి (35) మృతి చెందిన ఘటన చేగుంట పోలీస్స్టేషన్ పరిధిలోని మాసాయిపేట బొమ్మారం గేటు వద్ద సోమవారం చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భిక్షాటన చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తి ఉదయం రోడ్డు వెంట వెళ్తున్న సమయంలో వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలు కాగా జీఏఆర్ అంబులెన్స్లో చికిత్స నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందినట్లు మాసాయిపేట పంచాయతీ కార్యదర్శి సుంకరి నాగభూషణం తెలిపారు. మృతుడికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే చేగుంట పోలీస్స్టేషన్ (9490617052) లో సంప్రదించాలని ఎస్సై ప్రకాశ్గౌడ్ తెలిపారు.
శివ్వంపేటలో ఇద్దరికి గాయాలు
శివ్వంపేట, జూన్6: ఎదురెదురుగా వస్తున్న బైక్లు ఢీకొని ఇద్దరికి గాయాలైన ఘటన శివ్వంపేట పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకున్నది. ఎస్సై రవికాంత్రావు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా మూసాపేటకు చెందిన వడ్ల శ్రీనివాస్ గోమారం మీదుగా బైక్పై పాపన్నపేట మండలం మల్లంపేటకు వెళ్తున్నాడు. టిక్యాతండాగ్రామ శివారులో ఎదురుగా అతివేగంగా యూనికాన్ బైక్తో ఎదురుగా వచ్చిన ఒక వ్యక్తి ఢీకొట్టాడు. దీంతో శ్రీనివాస్కు, బైక్పై ఉన్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి. శ్రీనివాస్ మామ వడ్ల సుధాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.