మెదక్, జూలై 30 : ఇటుక బట్టీలు, మెకానిక్ షెడ్లు, బాల్యం కరిగిపోతుంది. తప్పిపోయిన వారు.. అనాథలు బస్టాండ్, రైల్వే స్టేషన్లలో భిక్షాటనకు పరిమితమవుతున్నారు. ఇలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ప్రభుత్వం 2015లో పోలీసు, శిశు సంక్షేమం, కార్మికశాఖ ఆధ్వర్యంలో ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు చేపడుతున్నది. మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు ఆరు విడుతలుగా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు. జూలై ఒకటో తేదీ నుంచి ఏడో విడుత ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ప్రారంభమై 31 వరకు ముగిసింది.
మెదక్ జిల్లాలో 2020 నుంచి 2021 జూలై వరకు ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ద్వారా 154 మంది బాల బాలికలను గుర్తించి వారి సంరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి ఆపరేషన్ ముస్కాన్-7 కార్యక్రమాన్ని జిల్లాలో పోలీసు, లేబర్, శిశు సంక్షేమం శాఖల సమన్వయంతో జూలై ఒకటో తేదీ నుంచి రెస్క్యూ బృందాలు బాలలను గుర్తించారు. జూలై ఒకటిన ముస్కాన్ కార్యక్రమం ప్రారంభించి 31వ తేదీ వరకు కొనసాగింది. మొత్తం 154 మందిని గుర్తించి వారికి విముక్తి కల్పించారు. కొంతమందిని పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించారు.
మరికొంత మందిని ఇతర రాష్ర్టాలకు పంపించి అక్కడి పాఠశాలల్లో చేర్పించారు. మెదక్ జిల్లా పరిధిలోని పోలీసు అధికారులు, శిశు సంక్షేమ శాఖ, కార్మికశాఖ ప్రధాన పాత్ర పోషించాయి. జిల్లాలో ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు, ఓ మహిళా కానిస్టేబుల్, ఇతర శాఖల నుంచి అధికారులు రెస్క్యూ బృందాలుగా ఏర్పడి ఇటుక బట్టీలు, మెకానిక్ షెడ్లు, కిరాణ షాపులు, హోటళ్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్లలో భిక్షాటన చేసేవారిని తప్పిపోయిన వారిని, అనాథ బాలలను గుర్తించారు. అనంతరం వారి తల్లిదండ్రులతో మా ట్లాడి అప్పగించడం లేదా వసతి గృహాల్లో చేర్పించారు. ఇదిలా ఉండగా, అనాథలైతే బాలసదన్, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు.
జిల్లాలో రెండు డివిజన్లలో ముస్కాన్-7
మెదక్ జిల్లాలో రెండు డివిజన్లు మెదక్, తూప్రాన్లో ఆపరేషన్ ముస్కాన్-7 కార్యక్రమాన్ని జూలై 1 నుంచి 31 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. 2017 జనవరిలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ ద్వారా 161 మందిని, 2017 జూలైలో ముస్కాన్ ద్వారా 135 మంది, 2018 జనవరిలో స్మైల్ ద్వారా 81, ముస్కాన్ ద్వారా 118 మంది, 2019 జనవరిలో ఆపరేషన్ స్మైల్లో 99 మంది, 2019 జూలైలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 94 మంది, 2020లో ఆపరేషన్ స్మైల్లో 66 మంది, 2021ఆపరేషన్ ముస్కాన్లో 88 మంది బాల బాలికలను చేరదీసి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి అప్పగించారు.
31 రోజుల్లో 154 మందికి విముక్తి…
జూలై ఒకటిన ఆపరేషన్ ముస్కాన్ -7 కార్యక్రమాన్ని ప్రారంభించి 31వరకు చేపట్టారు. జిల్లాలోని రెండు డివిజన్లలో రెస్క్యూ బృందాలు ఏర్పడి ఇటుక బట్టీలు, హోటళ్లు, కిరాణాషాపుల్లో పనిచేస్తున్న 154 మందిని గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసు అధికారులు, శిశు సంక్షేమశాఖ, కార్మికశాఖ ప్రధాన పాత్ర పోషించి ఆపరేషన్ ముస్కాన్-7 కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఆపరేషన్ ముస్కాన్-7విజయవంతం
జిల్లాలో జూలై ఒకటో తేదీ నుంచి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్-7 కార్యక్రమంలో 154 మంది బాల బాలికలను గుర్తించాం. జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాం. పోలీసు అధికారులు, కార్మిక శాఖ, మహిళా శిశు సం క్షేమశాఖ ఆధ్వర్యంలో బాల కార్మికులను గుర్తించాం.
-కరుణశీల, డీసీపీవో మెదక్