మెదక్ మున్సిపాలిటీ, జూలై 26: వినికిడి శక్తి చాలా ముఖ్యమైనదని తెలంగాణ సమగ్రశిక్ష రాష్ట్ర కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి రాములు అన్నారు. జిల్లా సమగ్రశిక్ష ఆధ్వర్యంలో జిల్లాలోని మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్లు, ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు సోమవారం జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. పిల్లల్లో వినికిడి లోపంతో పాటు ఇతర వైకల్యాలను తొలగించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయి కార్యక్రమంలో ఆయా అంశాలను సమర్థవంతంగా అందించాలని పేర్కొన్నారు. ప్రధాన వక్తగా పాల్గొన్న హైదరాబాద్ ఈఎన్టీ వైద్యశాల వైద్యులు, ప్రతిష్టాత్మక బీసీ రాయ్ మెమోరియల్ అవార్డు గ్రహిత డాక్టర్ ఆర్.రమేశ్ మాట్లాడుతూ వైకల్యాల కారణంగా అభ్యసనలో వెనకబడ్డ విద్యార్థులకు సరైన తోడ్పాటునందించాలన్నారు. వినికిడి లోపం కలిగిన పిల్లలను తొలి దశలోనే గుర్తించడం ద్వారా సమస్యను నివారించవచ్చన్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విలీన విద్య జిల్లా సమన్వయకర్త కమ్యూనిటీ మొబైలైజేషన్ అధికారి డాక్టర్ సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ మెదక్ జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల 1,416 మంది ఉన్నట్లు ఇటీవల జరిగిన సర్వేలో వెల్లడైనదన్నారు. శిక్షణ అనంతరం ఎంపిక చేసిన ఉపాధ్యాయులతో క్షేత్రస్థాయి శిక్షణ అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఉపాధ్యాయులకు జిల్లా స్థాయిలో శిక్షణ అనంతరం మండల, కాంప్లెక్స్ స్థాయిల్లో పంచాయతీరాజ్ సంస్థలు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల సభ్యులతో పాటు జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ శిక్షణ నిర్వహిస్తామని జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్ చెప్పారు. కార్యక్రమంలో బాలికా విద్య సమన్వయకర్త జ్యోతి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మంజరిలతో పాటు మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఐఈఆర్పీలు, ఎంపిక చేసిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.