మెదక్, జూలై 3 : పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు మెదక్ జిల్లాలో జోరుగా సాగుతున్నాయని కలెక్టర్ ఎస్.హరీశ్ తెలిపారు. శనివారం మెదక్ నుంచి నర్సాపూర్ జాతీయ రహదారి వెంట మొక్కలు నాటే పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా విరివిగా మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. జిల్లా అటవీ శాఖ అధికారుల సూచనల మేరకు పెద్ద మొక్కలు నాటడంతోపాటు వాటి పరిరక్షణ బాధ్యత చేపట్టాలని తెలిపారు. 85 శాతం మొక్కలు బతకాలని, చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటాలని చెప్పారు. సీఎం కేసీఆర్ హరితహారానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి రహదారుల వెంట ఖాళీ స్థలాలు, ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని ఆదేశించారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పల్లె, పట్టణ ప్రగతి భాగంగా జిల్లా అంతటా మొక్కలు నాటుతున్నామన్నారు. ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాతీయ ప్రాధికార సంస్థ కార్యనిర్వహక ఇంజినీరు ధర్మారెడ్డి, డీఈ ధర్మారెడ్డి, డీఎఫ్వో జ్ఞానేశ్వర్, కొల్చారం, కౌడిపల్లి, అధికారులు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి..
కౌడిపల్లి, జూలై 3 : హరితహారంలో భాగంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ హరీశ్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని తునికి గేటు సమీపంలో గల రైతు వేదిక ఎదుట ఆయన మొక్క నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.పరిసరాల పరిశుభ్రతపై అందరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో భారతి, తహసీల్దార్ రాణాప్రతాప్సింగ్, సర్పంచ్ లక్యానాయక్, ఏపీఎం పాల్గొన్నారు.
ప్రగతి పనులను పరిశీలన
చేగుంట, జూలై 3 : మండల పరిధిలోని సంకాపూర్, శేరిపల్లి గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ శనివారం పరిశీలించారు. కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నార్సింగిలోఎంపీపీ సబిత ఆధ్వర్యంలో ఆమె మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఎర్రం అశోక్, ప్రత్యేకాధికారి జగదీశ్, ఎంపీడీవో ఆనంద్మేరి, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీటీసీలు సత్యనారాయణ, బండారి సంతోష, వార్డెన్ సుజాత, సొసైటీ డెరెక్టర్ కుమ్మరి బాబు, రైతుబంధు మండల అధ్యక్షుడు ఎన్నం లింగారెడ్డి, సంకాపూర్ సర్పంచ్ సుజాత, కో-ఆప్షన్ సభ్యులు, ఏఈవో యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యం
గ్రామాల అభివృద్ధి కోసమే పల్లెప్రగతి
చిన్నశంకరంపేట, జూలై 3 : గ్రామాల అభివృద్ధి కోసమే ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టిందని జడ్పీ సీఈవో శైలేష్ అన్నారు. శనివారం మండల పరిధిలోని టి.మాందాపూర్, మాందాపూర్ గిరిజన తండా, సంగాయిపల్లి, రుద్రారం తదితర గ్రామాల్లోని పల్లెప్రగతి పనులను ఆయన పరిశీలించారు. డంపింగ్యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృ తి వనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ వెంకటయ్య, ఎంపీడీవో గణేశ్రెడ్డి, ఎంపీవో గిరిధర్రెడ్డి, సంబంధిత గ్రామా ల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న ప్రగతి పనులు..
చేగుంట, జూలై 3 : మండల పరిధిలోని పలు గ్రామాల్లో పల్లె ప్రగతి పను లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మండల ప్రత్యేక అధికారి జయరాజ్, ఎంపీడీవో ఉమాదేవి గ్రామాల్లో పర్యటించారు. చందాయిపేటలో సర్పంచ్ బుడ్డ స్వర్ణలత ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేశారు. పెద్దశివనూర్లో జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, సర్పంచ్ రుక్మిణీబాయి రోడ్డుకు ఇరువైపులా కలుపు మొక్కలను తొలిగింపజేశారు. చేగుంటలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్ మొక్కలు పంపిణీ చేశారు. చిన్నశివునూర్లో సర్పంచ్ అశోక్ మొక్కలు పంపిణీ చేసి దోమల నివారణ మందును పిచికారీ చేయించారు. ఆయా కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.