మెదక్ మున్సిపాలిటీ, జూన్ 26 : కాంట్రాక్ట్ లెక్చరర్లలకు బేసిక్ పే వర్తింపజేస్తూ ఈ నెల 16న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై లెక్చరర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు 11వ పీఆర్సీ ప్రకారం బేసిక్ పే వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనాలు 30 శాతం పెరగనున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 654 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లకు లబ్ధి చేకూరనున్నది. బేసిక్ పే అమలుతో జూనియర్ కళాశాలల లెక్చరర్లకు ప్రస్తుతం ఉన్న వేతనం రూ.37,100 నుంచి 54,220 పెరుగనున్నది. డిగ్రీ కళాశాలల లెక్చరర్లకు రూ,40,270 నుంచి 58,850 పెరుగుతాయి. పాలిటెక్నిక్ లెక్చరర్లకు 40,270 నుంచి 58,850 పెరుగనున్నాయి. గెస్ట్ లెక్చరర్లకు ప్రస్తుతం పీరియడ్కు 300 ఇస్తుండగా, 30 శాతం పెంపుతో రూ.400 పెరుగునున్నాయి. వేతనాలు పెరుగనుండడంతో కాంట్రాక్ట్ లెక్చరర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలు ఒక్కోటి పరిష్కారమవుతుండటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 654 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు
ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 15, జూనియర్ కళాశాలలు 56, పాలిటెక్నిక్ కళాశాలలు 12 ఉన్నాయి. డిగ్రీ కళాశాలల్లో 127 మంది, జూనియర్ కళాశాలల్లో 433 మంది, పాలిటెక్నిక్ కళాశాలల్లో 83 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లుగా విధులు నిర్వహిస్తున్నారు.
కళాశాలల బలోపేతానికి కృషి చేస్తాం
ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి శక్తివంచన లేకుండా పని చేసి విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దుతాం. ప్రభుత్వం వేతనాలు పెంచడం ఎంతో ఆనందంగా ఉంది. పెండింగ్లో ఉన్న వేతనాలు తొందరగా విడుదల చేయాలి.
-అరుణ్కుమార్, తెలంగాణ పాలిటెక్నిక్ కళాశాలల జేఏసీ చైర్మన్
వేతనాలు పెంచడం సంతోషకరం
జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో పని చేస్తున్న కాం ట్రాక్ట్ లెక్చరర్ల వేతనాలలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది.ప్రభుత్వ నిర్ణయంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం.
-కనక చంద్రం, తెలంగాణ కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ చైర్మన్
కళాశాల విద్య మరింత బలోపేతం
కాంట్రాక్ట్ లెక్టరర్లకు ప్రభు త్వం బేసిక్ పే కల్పించడం హర్షణీయం. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది లెక్చరర్ల జీవితాల్లో వెలుగులు నింపినట్లయింది. తగిన వేతనం అందించడంతో రెట్టింపు ఉత్సాహంతో పని చేసి ఇంటర్, డిగ్రీ విద్యను మరింత బలోపేతం చేస్తాం.
-వినోద్కుమార్, తెలంగాణ కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ కో-చైర్మన్
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
మా కష్టాలను అర్థం చేసుకొని బేసిక్ పే వర్తింపజేసిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉం టాం. కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలను పరిష్కరిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
-ఫర్జనా జాబిన్, కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం మెదక్ జిల్లా మహిళా కార్యదర్శి