కొండపాక, జూన్ 12 : మాంసం కోసం కొందరు దుండగులు పాడి బర్రెను ట్రాక్టర్తో ఢీకొట్టి.. ఆపై కత్తులతో కోశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిర్సినగండ్లలో జరిగింది. త్రీటౌన్ పోలీస్స్టేషన్ సీఐ ప్రవీణ్కుమార్, స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాజగిరి వెంకటేశం తన రెండు పాడి బర్రెలను రోజు మాదిరిగానే శుక్రవారం సాయంత్రం పొలం వద్ద కట్టేసి ఇంటికి వెళ్లాడు. శనివారం తెల్లవారుజామున బర్రెలను మేపడానికి పొలం వద్దకు వెళ్లాడు. అప్పటికే రెండు పాడి బర్రెలు చనిపోయి ఉండటాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బర్రెల తుంటి భాగంతోపాటు ఒక కాలు, పొదుగును కత్తులతో కోసి మాంసాన్ని తీసుకుపోయిన పరిస్థితి చూసి ఒక్కసారిగా రైతులు, స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానికులునిందితులను పట్టుకోవడానికి గ్రామ శివార్లలో వెతికారు.
దమ్మక్కపల్లి గ్రామ శివారులోని రాజేందర్రెడ్డికి చెందిన మామిడి తోటలో ఉన్న ఓ గదిలో బర్రె మాంసం లభ్యమైంది. దీంతో ఏం జరిగింది అనే విషయమై స్థానికులు ఆరా తీశారు. నేపాల్ దేశానికి చెందిన సందీప్ సునార్ మరో ముగ్గురితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. అనంతరం సిద్దిపేట త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. త్రీటౌన్ సీఐ ప్రవీణ్కుమార్ ఘ టనా స్థలాన్ని పరిశీలించి నిందితుడితో పాటు మామిడి తోట పర్యవేక్షకుడు దమ్మక్కపల్లి గ్రామానికి చెందిన మేకల మల్లేశాన్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనలో వాడిన ట్రాక్టర్, కత్తులను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఘటనపై సీఐ ప్రవీణ్కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.
బతుకుదెరువు పోయింది..
పాడి బర్రెలను గుర్తు తెలియని దుండగులు చంపివేయడంతో తన కుటుంబం జీవనాధారాన్ని కోల్పోయిందని బాధితుడు రాజగిరి వెంకటేశం కన్నీరుమున్నీరుగా విలపించాడు. సుమారు లక్షన్నరకు పైగా నష్టం జరిగినట్టు తెలిపాడు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరాడు. సర్పంచ్ గూడెం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బతుకుదెరువు కోసం వచ్చే ఇతర రాష్ర్టాల, దేశాల వలసకూలీల పూర్తి వివరాలను సేకరించాలని కోరారు. ఫామ్హౌస్లో ఉంటున్న కూలీల వివరాలను యజమానులు ఆయా పంచాయతీల్లో అందజేయాలని సూచించారు.