మెదక్, జూన్ 12: కల్తీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా స్థాయిలో పోలీసు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్రావు తెలిపారు. శనివారం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో దృశ్య సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పా టు చేసి ఎప్పటికప్పుడు కల్తీ విత్తనాలను అమ్మకాలను నిరోధించే విధంగా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలన్నారు. విత్తన చట్టం ప్రకారం 1983 లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని సూచించారు. బిల్లులకు తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలని తెలిపారు. గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ చందనదీప్తి, అదనపు ఎస్పీ కృష్ణమూర్తి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురాంనాయక్, సహా య మండల వ్యవసాయాధికారులు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.