మెదక్, జూన్ 8 : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నారు. జిల్లాలో ప్రజలకు సాధారణ పరీక్షలతో పాటు ఖరీదైన వైద్య పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల వారు సమీప పీహెచ్సీలో శాంపిల్స్ ఇస్తే 24 గంటల్లో రిపోర్టులు అందనున్నాయి. జిల్లాలోని పీహెచ్సీలు, సీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్, ఏరియా దవాఖానలకు వచ్చే రోగుల నుంచి రక్త, మూత్ర, ఇతర నమూనాలు తీసి జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్ కేంద్రానికి పంపుతారు. 24 గంటల్లోనే ఫలితాలు తిరిగి అన్ని పీహెచ్సీలకు పంపిస్తారు. జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్ కేంద్రంలో పూర్తి స్థాయి సేవలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
57 రకాల పరీక్షలు..
తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా కార్పొరేట్ సెంటర్లకు ధీటుగా 57 రకాల పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సెంటర్ల ద్వారా క్లినికల్ పాథాలజీ, మైక్రో బయాలజీ, క్లినికల్ బయో కెమిస్ట్రీకి చెందిన ప రీక్షలు చేస్తారు. ముఖ్యంగా బయోకెమిస్ట్రీ కి చెందిన 36 రకాల పరీక్షలు అలాగే పాథాలజీకి చెందిన 13 రకాల పరీక్షలు చేస్తారు. ఇంకో మైక్రోబయోలజీకి చెందిన చికున్గున్యా ఎంజీఎం, డెంగీ, ఆర్పీఆర్ వం టి 8 రకాల పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలు ఉచితంగా నిర్వహించడంతో బాధితులకు ఆర్థికంగా ఎంతో మేలు చేకూరుతుంది.
మూడు వాహనాల ద్వారా శాంపిల్స్ సేకరణ..
జిల్లా కేంద్ర దవాఖానలో డయాగ్నోస్టిక్ కేంద్రం ప్రారంభించిన తర్వాత పూర్తి స్థాయి శాంపిల్ సేకరణను బుధవారం నుంచి ప్రారంభించనున్నారు. ఇం దుకోసం 10 మంది ల్యాబ్ టెక్నీషియన్లు మూడు ప్రత్యేక వాహనాలను కేటాయించారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్ డివిజన్ పరిధిలోని పీహెచ్సీలు, సీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏరియా దవాఖానాల నుంచి సేకరించిన శాంపిల్స్ను జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్ కేంద్రానికి తీసుకొస్తారు. ఇక్కడ ఉచితంగా పరీక్షలు చేసిన తర్వాత రిపోర్టులను ఆయా దవాఖానాలకు పంపిస్తారు. జిల్లాలో 20 పీహెచ్సీలు, రెండు సీహెచ్సీలు, ఒక ఏరియా దవాఖాన, ఒక జిల్లా కేంద్ర దవాఖానలున్నాయి. ఇందులో అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, గడిపెద్దాపూర్, రేగోడ్ పీహెచ్సీల నుంచి సేకరించిన నమూనాలను సంగారెడ్డి జిల్లా కేంద్ర దవాఖాన సిబ్బంది సేకరిస్తారు. మిగిలిన 16 పీహెచ్సీలు, రెండు సీహెచ్సీలు, ఒక ఏరియా దవాఖాన నుంచి నమూనాలను సేకరిస్తారు.
57 రకాల పరీక్షలు చేస్తాం..
జిల్లా కేంద్ర దవాఖానలోని డయాగ్నోస్టిక్ కేంద్రంలో 57 రకాల పరీక్షలు చేస్తాం. బుధవారం నుంచి పూర్తి స్థాయిలో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తాం. 24 గంటల్లోనే రిపోర్టులను అందజేస్తాం. జిల్లాలోని 16 పీహెచ్సీల నుంచి నమూనాలను సేకరించడానికి మూడు ప్రత్యేక వాహనాలు అందుబాటులో ఉన్నాయి. డయాగ్నోస్టిక్ కేంద్రంలో 10 మంది ల్యాబ్ టెక్నీషియన్లు అందుబాటులో ఉన్నారు.
డాక్టర్ అనిల, నోడల్ అధికారి