కొండాపూర్, ఏప్రిల్ 10 : కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా టీకా తీసుకుంటే క్షేమంగా ఉండటానికి ఆస్కారం ఉంటుందని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం కొండాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా పంచాయతీ సిబ్బందికి వయస్సు పరిమితి లేదన్నారు. సుమారుగా 150 మందికి పైగా కచ్చితంగా వ్యాక్సిన్ అందించేందుకు అధికారులు అవగాహన కల్పించి, వ్యాక్సిన్ వేసుకునేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి రేష్మఅంజూమ్, ఎంపీడీవో జయలక్ష్మి, ఎంపీవో ఆండాళమ్మ, ఏపీవో వీరప్ప, వైద్యా సిబ్బం ది అంజప్ప, విజయ్కుమార్ పాల్గొన్నారు.
ప్రభుత్వ వైద్యశాల తనిఖీ
కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని, 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్ టీకాను వేసుకోవాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం సదాశివపేటలోని ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేశారు. రోగులతో చర్చించి, వ్యాక్సినేషన్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫ్రంట్లైన్ వారియర్స్ మున్సిపల్ కార్మికులకు వ్యాక్సినేషన్ చేయించినట్లు తెలిపారు. అదే విధంగా ఇది వరకు మొదటి డోస్ వేసుకున్న వారందరూ విధిగా రెండో డోస్ వేయించుకోవాలని సూచించారు. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించకుంటే పోలీసు శాఖ ఆధ్వర్యంలో రూ.వెయ్యి జరిమానా విధిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సదాశివపేట మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, దవాఖాన సూపరింటెండెంట్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.