న్యాల్కల్/మునిపల్లి, ఏప్రిల్ 8 : భానుడి ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్నది. వేడిమి నుంచి ఉపశమనం కోసం ప్రజానీకం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నది. పేదోడి ఫ్రిజ్గా పిలువబడే మట్టి కుండలు, పాత్రలపై జనం దృష్టి పెడుతున్నది. గ్రామాలు, పట్టణాలకు చెందిన కుమ్మరులు మట్టి పాత్రలు తయారు చేయడమే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. కుండలో చల్లబడ్డ నీరు తాగితే, ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తుండడంతో ఫ్రిజ్ సౌకర్యం ఉన్న వారే కాకుండా పేదలు వాటిని కొంటున్నారు. సైజును బట్టి రూ.100 నుంచి రూ.500 వరకు మట్టి పాత్రలను అమ్ముతున్నారు. అలాగే, కూలర్లకు గిరాకీ పెరుగుతున్నది. కొందరు పాత కూలర్లను రిపేయిర్ చేయిస్తుండగా, మరికొందరు కొత్తవి కొంటున్నారు. గతేడాది కరోనా ప్రభావం ఉండడంతో ప్రజలు కూలర్లపై ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం ప్రజలు కూలర్ల వినియోగంపై అధికంగా దృష్టి పెట్టడంతో మార్కెట్లో కూలర్లకు భలే డిమాండ్ పెరిగింది. గతేడాది కరోనా ప్రభావం ఉండడంతో వ్యాపారం ఆంతంత మాత్రంగానే సాగింది. ప్రస్తుతం ఎండ తీవ్రత పెరుగుతుండడంతో ఉక్కుపోతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సీజన్లో కూలర్ల వ్యాపారం బాగుందని వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.