అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ పక్వాడ్ కార్యక్రమాలు
పౌష్టికాహారంపై అవగాహన ర్యాలీలు
పెరటితోటల పెంపకంపై ప్రత్యేక దృష్టి
మెదక్/మెదక్ రూరల్, మార్చి 29 : అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందే సేవలను పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు తెలియజేసేందుకు పోషణ్ పక్వాడ్ కార్యక్రమాలను అధికారులు నిర్వహిస్తున్నారు. గర్భిణులు, చిన్నారులు, బాలింతల్లో పౌష్టికాహార లోపం అధిగమించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ్ నిర్వహిస్తున్నారు. అయితే మెదక్ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన సదస్సులు, ర్యాలీలు చేపడుతున్నారు.
16న ప్రారంభం… 31తో ముగింపు..
ఈనెల 16న ప్రారంభమైన పోషణ్ పక్వాడ్ కార్యక్రమం ఈనెల 31 వరకు కొనసాగుతుంది. మెదక్ జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల్లో 1076 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. తల్లులకు పోషక విలువలు, అదనపు ఆహార విశిష్టత, తల్లిపాల ప్రాముఖ్యత, రక్తహీనత తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈసారి పోషణ్ పక్వాడ్ కార్యక్రమంలో పెరటితోటల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో స్థలాలు ఉంటే పెరటి తోటలు పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పోషణ, పౌష్టికాహారం..
సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నారు. సరైన పోషణ, పౌష్టికాహారం, తాగునీరు, పరిశుభ్రతపై అంగన్వాడీ టీచర్లు, అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందే సేవలను పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు తెలియజేసేలా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కిశోర బాలికలు, బాలింతలను, చిన్నారులను పౌష్టికాహారం లోపం నుంచి విముక్తి చేసేందుకు పోషణ్ పక్వాడ్ దోహదపడుతుంది.
పోషణ్ పక్వాడ్ ఇలా…
రోజువారీ గృహ సందర్శన, అంగన్వాడీ కౌన్సిలింగ్ బుక్ ఉపయోగిస్తున్నారు.
పోషకాహర పంటలను తయారీ విధానం ప్రదర్శించడం.
కిశోర బాలికలను ఆరోగ్య సిబ్బంది సహకారంతో హిమోగ్లోబిన్ పరీక్షలు చేయించడం, ఐఎఫ్ఏ మాత్రలు ఇవ్వడం.
బాల్య వివాహాల నివారణ చర్యలు, బాల్య వివాహాల ద్వారా కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం.
అంగన్వాడీ టీచర్లు గ్రామాల్లో గర్భిణులు, చిన్నారుల బరువు కొలవడంతోపాటు వారి పోషణ స్థితిని గుర్తిస్తున్నారు.
ఫ్రీ స్కూల్ పిల్లలకు సైకిల్ గేమ్స్, స్లోగన్స్, ప్లకార్డ్ ఉపయోగించి ఆడించడం.
వ్యక్తిగత పరిశుభ్రత, మరుగుదొడ్డిని వినియోగించడం, సబ్బుతో చేతులు శుభ్రం చేయడం, సురక్షితమైన నీటిని తాగడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నాం..
పోషణ్ పక్వాడ్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నాం. జిల్లాలోని ప్రాజెక్టుల వారీగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ పక్వాడ్ కార్యక్రమాలను అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేస్తున్నారు. కిశోర బాలికలు, బాలింతలు, చిన్నారులను ఆరోగ్యవంతులుగా చేయడమే పోషణ్ పక్వాడ్ లక్ష్యం.