మెదక్, మే 28 : ప్రభుత్వం విధించిన లాక్డౌన్ అమలుకు ఖాకీలు కంటిమీద కునుకు లేకుండా విధి నిర్వహణలో పాల్గొంటున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు పోలీసు యంత్రాంగం 24 గంటలు అహర్నిశలు కృషిచేస్తున్నది. పోలీసులు కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ప్రజలు హట్యాఫ్ చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో రెండు సబ్ డివిజన్లు,21 పోలీస్స్టేషన్లు..
మెదక్ జిల్లాలో రెండు సబ్ డివిజన్లు, 21 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా సేవలందిస్తున్నారు. సుమారు వెయ్యి మంది సిబ్బంది లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆదేశాల మేరకు సీఐల ఆధ్వర్యంలో ఎస్సైలు పకడడ్బందీగా అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రోడ్లపైకి వచ్చి లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. 10 గంటల తర్వాత రోడ్లపై ఎవరూ ఉండకుండా చూస్తున్నారు. ఈ-పాసులు లేని వారిని అనుమతించడం లేదు. ఎవరైనా అనవసరంగా బయటకు వస్తే వాహనాలను సీజ్ చేస్తున్నారు. అనుమతులు ఉన్న వారిని మాత్రమే పంపుతున్నారు. జిల్లాలోని పెద్దశంకరంపేట, టేక్మాల్, రామాయంపేట, చేగుంట, తూ ప్రాన్, మనోహరాబాద్ ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తూ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మం డల కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లలో నిరంతరం విధుల్లో ఉంటూ కట్టుదిట్టం చేస్తున్నారు.
జిల్లాలో 34 లక్షల 96వేల జరిమానాలు..
మెదక్ జిల్లాలో ఈ నెల 12 నుంచి 25వ తేదీ వరకు 4451 కేసులు నమోదు చేసి రూ.34 లక్షల 96వేల జరిమానాలు విధించారు. మాస్క్ ధరించకపోవడంపై 522 మందిపై కేసులు నమోదు చేసి, రూ.5 లక్షల 22వేల జరిమానా విధించారు. భౌతికదూరం పాటించకపోవడంపై 63 మందిపై కేసు నమోదు చేశారు. లాక్డౌన్ ఉల్లంఘించిన 3,858 మందిపై రూ.29 లక్షల 74వేల జరిమానాలు విధించారు. మొత్తంగా 4,451 మందిపై కేసు నమోదు చేసి, రూ.34 లక్షల 96వేలు జరిమానాలు విధించినట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, జిల్లాలో 1333 వాహనాలను సీజ్ చేసినట్టు జిల్లా అదనపు ఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు.
అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసులు
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారు. ప్రజలు రోడ్లపైకి రాకుం డా కట్టుదిట్టం చేస్తున్నా రు. ఎవరైనా బయటకు వస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకోవడమే కాక కేసు నమోదు చేస్తున్నాం. కరోనా విషయంలో ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ దిశగానే జిల్లాలో పక్కగా లాక్డౌన్ను అమలు చేస్తున్నాం. ఈ-పాస్లు ఉంటేనే వాహనాలను అనుమతిస్తున్నాం.
నిబంధనలు పాటించాలి
లాక్డౌన్ నిబంధనలను ప్రజలు తప్పకుండా పాటించాలి. మెదక్ రూరల్ సర్కిల్ పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్లలో చెక్ పోస్టులు ఏర్పా టు చేశాం. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపై తిరిగితే వెంటనే వారి వాహనాన్ని సీజ్ చేస్తున్నాం. అనుమతులు ఉన్న వారిని మాత్రమే పంపుతున్నాం.