పూర్తి ఏర్పాట్లు చేసిన అధికారులు
43 వార్డులకు గానూ.. బరిలో 236 మంది అభ్యర్థులు
130 పోలింగ్ కేంద్రాలు, 1,00,653 మంది ఓటర్లు
విధుల్లో పాల్గొననున్న 1260 మంది సిబ్బంది
నేడు ఇందూర్ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ
సిద్దిపేట అర్బన్/సిద్దిపేట జోన్, ఏప్రిల్ 28 : రేపు(శుక్రవారం) జరిగే మున్సిపల్ ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు పోలింగ్ కేంద్రాలతో పాటు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఇప్పటికే సిద్ధం చేశారు. పట్టణంలో మొత్తం 43 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందు కోసం 60స్థానాల్లో 130 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 1,00,653 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు కల్పిందుకు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు ఎన్నికల పరిశీలకులు వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ పోలింగ్ కేంద్రాలతో పాటు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కరోనా ఉధృతి దృష్ట్యా కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 43 వార్డుల్లో జరుగుతున్న పోలింగ్కు 236మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 43 వార్డుల్లో మొత్తం 1,00,653 మంది ఓటర్లు ఉండగా, అందులో 49,875 పురుష ఓటర్లు, 50,767 మంది మహిళా ఓటర్లు ఉండగా, 11 మంది ఇతరులు ఉన్నారు. ఇందుకు గానూ 129 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, వీటిని మొత్తం 11 జోన్లు విభజించారు. జోన్కో అధికారి చొప్పున 11మంది ఆఫీసర్లు, 3 రిజర్వ్డ్తో కలిసి మొత్తం 14 మంది జోనల్ ఆఫీసర్లు, 17మంది రిటర్నింగ్ ఆఫీసర్లు (14+3(రిజర్వ్డ్)), 17 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు(14+3(రిజర్వ్డ్))ను నియమించారు. 155మంది పోలింగ్ ఆఫీసర్లు(129+26(రిజర్వ్డ్)), 155 మంది ఏపీఓలు (129+26), 464 మంది ఓపీఓల(387+77)ను నియమించారు. 60 పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ, 69పోలింగ్ కేంద్రాల్లో వెబ్క్యాస్టింగ్ చేయనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా 47 వీల్చైర్లను ఉంచారు.
465మంది పోలీసులతో బందోబస్తు
ఎన్నికలు ప్రశాంత వాతారణంలో జరిగేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంది. ఇందుకు గానూ సుమారు 465 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నది. ఇందులో ముగ్గురు అడిషనల్ డీసీపీలు, నలుగురు ఏసీపీలు, 14 మంది సీఐలు, 31 మంది ఎస్సైలు, వీరితో పాటు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ఆర్మ్డ్ రిజర్వ్ అధికారులు మొత్తం 415 మంది సిబ్బంది కాగా, మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషనల్ స్ట్రైకింగ్ ఫోర్స్తో కలిపి మొత్తం 465 మంది పోలీసులు మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వర్తించనున్నారు.
నేడు ఎన్నికల సామగ్రి అందజేత
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలో పోలింగ్ కేంద్రాలకు కావాల్సిన సామగ్రిని సిబ్బందికి నేడు అందజేయనున్నారు. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిబ్బందికి మాస్కులు, ఫేస్ ఫీల్డ్, గ్లౌజులు, శానిటైజర్లు సిద్ధం చేసి ఉంచారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి ఎన్నికల సామగ్రిని సిబ్బందికి అందజేస్తారు. సామగ్రి తరలింపునకు ప్రత్యేకంగా వంద వాహనాలు ఏర్పాటు చేశారు.
పోస్టల్ బ్యాలెట్కు 190 మంది దరఖాస్తు..
మున్సిపల్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం 190 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 80ఏండ్లకు పైబడిన వృద్ధులు 163 మంది ఉండగా, కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారు ఐదుగురు, వికలాంగులు ఇద్దరు, సర్వీస్ ఓటర్లు నలుగురు, ఆన్లైన్ ద్వారా 16మంది దరఖాస్తు చేసుకున్నారు.
మాస్కు ఉంటేనే ఓటు..
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలనుకునే వారు కచ్చితంగా మాస్కు ధరించాలని ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది. మాస్కు లేని వారికి పోలింగ్ కేంద్రంలోకి అనుమితించబోమని తేల్చి చెప్పింది. కరోనా ఉధృతి అధికంగా ఉన్న దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఓటర్ల కోసం ప్రతి పోలింగ్ కేంద్రం బయట శానిటైజేషన్ ఏర్పాటు చేశామని, వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు.
ఏర్పాట్లను పరిశీలించిన
అడిషనల్ కలెక్టర్, ఏసీపీ
శుక్రవారం జరిగే సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశామని అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ అన్నారు. ఈ మేరకు ఆయన ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ దృష్ట్యా సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి కావాల్సిన గ్లౌస్లు, ఫేస్ ఫీల్డ్, శానిటైజర్లు, మాస్కులను అందిస్తున్నామన్నారు. మాస్కు ధరించని వారిని పోలింగ్ కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద మెడికల్ సిబ్బందితో టెంపరేచర్ చెక్ చేసి తర్వాతే లోపలికి ఓటర్లను పంపిస్తామన్నారు. మాస్కులు లేకుండా బయట తిరిగే వారిపై చర్యలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ రామేశ్వర్ మాట్లాడుతూ 465 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.