తూప్రాన్ రూరల్ మార్చి 27: తూప్రాన్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని, పెద్దచెరువును ఆధునిక హంగులతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, వైస్చైర్మన్ శ్రీనివాస్, కమిషనర్ మోహన్కు కలెక్టర్ హరీశ్ సూచించారు. తూప్రాన్లో శనివారం ఆర్డీవో శ్యాంప్రకాశ్తో కలిసి ఆకస్మికంగా పర్యటించారు. పట్టణంలోని పశువైద్య దవాఖాన వద్ద నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. పట్టణ శివారులో జరుగుతున్న వైకుంఠధామం, డంపింగ్యార్డు నిర్మాణం పనులను గమనించారు. పెద్దచెరువుకట్టపై ఇరువైపులా నాటి సంరక్షిస్తున్న హరితహారం మొక్కలను చూసి మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దచెరువు కట్టపై ఆహ్లాదాన్నిచ్చే పలు రకాల మొక్కలు నాటి పర్యాటక కేంద్రంగా రూపొందించాలన్నారు. చెరువుకట్టపైకి వచ్చిన పర్యాటకులకు మంచి వాతావరణం ఇచ్చేవిధంగా తీర్చిదిద్దాలన్నారు. చెరువు పక్కన చిల్డ్రన్స్ పార్క్ను నిర్మిస్తున్నామని చైర్మన్, వైస్చైర్మన్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పెద్దచెరువు, చిల్డ్రన్స్ పార్క్ల సుందరీకరణకు అవసరమైన నిధులను కేటాయిస్తానని ఆయన భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్యాంప్రకాశ్, పీఆర్ డీఈ నర్సింహులు, వివిధ శాఖాధికారులు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
పెండింగ్ పనులపై దృష్టి పెట్టండి…
పట్టణంలో అసంపూర్తిగా మిగిలిపోయిన అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని అధికారులు, కాంట్రాక్టర్లను కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. వైకుంఠధామం, మున్సిపల్ భవనం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, డంపింగ్యార్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయించాలన్నారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేయించే బాధ్యత మున్సిపల్ పాలకవర్గానిదేనన్నారు.
బడ్జెట్, అభివృద్ధి పనులపై సమీక్ష…
ఆర్డీవో కార్యాలయంలో తూప్రాన్, నర్సాపూర్ పట్టణాల పరిధిలోని వివిధ శాఖాధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్నుల వసూళ్లు, చేపట్టిన అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. ఆయా పట్టణాల్లో జరుగుతున్న పనులను వేగవంతం చేయడంతోపాటు ఆస్తిపన్నులు వందశాతం పూర్తి చేయాలని సూచించారు.