పాపన్నపేట,మే 27: కరోనా బారినపడిన వారి కోసం ఐసొలేషన్ కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు పాపన్నపేట మం డల ప్రత్యేక అధికారి, అసిస్టెంట్ పీడీ భీమయ్య వెల్లడించారు. ఇందులో భాగంగా గురువారం మండల పరిధిలోని పొడ్చన్పల్లి, యూసుఫ్పేట, నాగ్సాన్పల్లి, అబ్లాపూర్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కరోనా బారిన పడిన వ్యాధిగ్రస్తులతో ఆయన మాట్లాడారు. వారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వ్యాధి సోకిన వారికి హోం ఐసొలేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పొడ్చన్పల్లి పాపన్నపేట ఎస్సై వసతి గృహం, నాగ్సాన్పల్లి ఉన్నత పాఠశాలలను హోం ఐసొలేషన్ కేంద్రాలుగా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విందులు, పెళ్లి, పేరంటాల పేరున కరోనా నియమాలను పాటించక పోవడంతో కరోనాను కట్టడి చేయలేక పోతున్నామని ఆయా గ్రామాల సర్పంచ్లు మండల ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఏపీడీ స్పందించి పిలిపించుకుని కరోనా నియమాలు పాటించకుండా ఏర్పాటు చేసే శుభకార్యాలు, విందుల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఎస్సై సురేశ్ను ఆదేశించారు. ప్రభుత్వం కరోనా కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించిందని, ప్రజల సహాయ సహకారాల ద్వారానే కొవిడ్ను కట్టడి చేయవచ్చని వివరించారు. ఆయన వెంటన పాపన్నపేట తహసీల్దార్ బలరాం, ఎంపీవో లక్ష్మీకాంతరెడ్డి తదితరులు ఉన్నారు.