పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
డంపింగ్ యార్డ్తో చెత్త సమస్యకు చెక్
పచ్చదనం పరిశుభ్రలో అగ్రస్థానం
సీసీ కెమెరాలతో ఊరంతా నిఘా..
మెదక్ రూరల్, మే 25: పల్లెలు అభివృద్ధిలో పరుగులు తీస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా మండల పరిధిలోని రాయిన్పల్లి గ్రామ రూపురేఖలు మారిపోయాయి. పచ్చదనం, పరిశుభ్రత ఆకట్టుకుంటున్నది. డంపింగ్ యార్డు, వైకుంఠధామ నిర్మాణం, నర్సరీ, పల్లెప్రకృతి వనం గ్రామానికి నూతన శోభను తెచ్చిపెట్టాయి. సీసీ రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణాలు పూర్తిచేశారు. పంచాయతీ సిబ్బంది రోజూ చెత్తను సేకరించడంతో వీధులన్నీ శుభ్రంగా దర్శనమిస్తున్నాయి.
అభివృద్ధి పనులు..
గ్రామంలో రూ.12 లక్షలతో వైకుంఠధామం, రూ.2.50 లక్షలతో డంపింగ్యార్డు, మరిన్ని నిధులతో గ్రామ పంచాయతీకి అవసరమైన ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ వంటి వస్తువులను కొనుగోలు చేశారు. గ్రామం మొత్తంగా ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. 100 శాతం ఇంటి పన్నులు వసూలు చేసి పట్టు కట్టడంలో ముందున్నది రాయిన్పల్లి గ్రామం. 100 శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఆదర్శంగా నిలిచింది. గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందిస్తూ హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు నేడు చెట్లుగా మారి పచ్చని అందాలను పంచుతున్నాయి. రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలను వాటర్ ట్యాంకర్ సహాయంతో సిబ్బంది నీటిని పడుతూ సంరక్షిస్తున్నారు. అంతేకాకుండా నర్సరీలో హరితహారం కోసం 1165 మొక్కలు నాటేందుకు సిద్ధం చేసి ఉంచారు. మొక్కలను సంరక్షించేందుకు గ్రీన్నెట్ షెడ్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికీ తాగునీటిని అందించేందుకు మూడు మిషన్ భగీరథ ట్యాంక్ల ద్వారా గ్రామంలో ఇంటింటికీ తాగునీటిని అందజేస్తున్నారు. గ్రామం చుట్టూ దట్టమైన అడవి ఉండటంతో కావేరి సీల్ట్ సహకారంతో, గ్రామ పంచాయతీ నిధులతో సీసీ కెమెరాలను సుమారు రూ. లక్షా 50వేల వ్యయంతో ఊరంతా 6 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు.
రాయిన్పల్లి ప్రాజెక్టుకు జలకళ
రాయిన్పల్లి ప్రాజెక్టు 282 ఎంసీఎప్టీ (మిలియన్ క్యూబిక్ ఫిట్) సామర్థంగల చెరువు. ఈ చెరువు కింద 1200 ఎకరాలు పంట సాగవుతున్నది. రాయినిపల్లి జలకళతో పచ్చటి పంటపొలాలతో కళకళలాడుతుంది.
గ్రామ స్వరూపం..
రాయిన్పల్లి గ్రామం చుట్టూ దట్టమైన అడవితో పచ్చదనంతో ఆకట్టుకుంటుంది. ఈ గ్రామ జనాభా 1181 కాగా, 245 ఇండ్లు, 8వార్డులున్నాయి.
గ్రామపంచాయతీ సిబ్బంది-3
వనసేవకులు-1
అంగన్వాడీ కేంద్రాలు-2
ప్రాథమిక ఉన్నతపాఠశాల-1
మిషన్ భగీరథ ట్యాంక్లు-3
సామాజిక పింఛన్లులు-276
గ్రామ అభివృద్ధే ధ్యేయం..
గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడమే ధ్యేయం. వార్డు సభ్యులు ఎంపీటీసీ, అధికారుల సహకారంతో గ్రామం ఆదర్శంగా నిలుస్తున్నది. పల్లె ప్రగతితో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నాం. గ్రామాల అభివృద్థికి నిధులు కేటాయిస్తున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
సిద్ధగౌడ్, సర్పంచ్ రాయిన్పల్లి
గ్రామం పరిశుభ్రంగా మారింది..
పల్లె ప్రగతితో గ్రామ రూపు రేఖలు మారిపోయాయి. పంచాయతీకి కొత్త ట్రాక్టర్ ఏర్పాటుతో పారిశుధ్య నిర్వహణ బాగుంది. సీజనల్ వ్యాధులు రాకుండా రసాయనాలు పిచికారీ, హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీటిని పడుతున్నారు.
నవనీత, పంచాయతీ కార్యదర్శి