మద్దూరు, మే 24 : ఎన్నో ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోని పల్లెటూరును పట్టణాలకు దీటుగా అభివృద్ధి పర్చాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కనీస సౌకర్యాలు లేని గ్రామంలో పల్లెప్రగతి పుణ్యామాని మౌలిక వసతులు సమకూరుతున్నాయి. డంపింగ్యార్డు నిర్మాణంతో ఇంటింటికీ తిరుగుతూ గ్రామపంచాయతీ ట్రాక్టర్తో చెత్తను సేకరించడంతో గ్రామంలోని ప్రతి వాడ పరిశుభ్రంగా మారుతున్నది. వైకుంఠధామంతో పాటు ప్రజలు సేద తీరేందుకు వీలుగా ప్రకృతివనాన్ని ఏర్పాటు చేశారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీల ఏర్పాటుతో పాటు వీధులన్నింటిలో సీసీరోడ్లను నిర్మించారు. దీంతో పల్లె ప్రగతిపథంలో దూసుకపోతున్నది.
మద్దూరు ముఖచిత్రం..
మండల కేంద్రమైన మద్దూరులో 3221 మంది జనాభా ఉండగా.. అందులో 1668 మంది పురుషులు, 1553 మంది మహిళలు ఉన్నారు. గ్రామంలో 673 నివాసాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలో 12 వార్డులు ఉన్నాయి. మిషన్భగీరథ ట్యాంకులు -2, పాత ఓవర్హెడ్ ట్యాంకు ద్వారా గ్రామస్తులకు తాగునీరు అందుతున్నది. గ్రామంలో 9మంది పారిశుధ్య కార్మికులు విధులను నిర్వర్తిస్తున్నారు.
అభివృద్ధి పథంలో మద్దూరు..
పల్లెప్రగతి నిధులతో మద్దూరు గ్రామం అభివృద్ధి పథంలో దూసుకపోతున్నది. గ్రామ పంచాయతీకి ప్రతి నెలా సుమారు రూ. 8లక్షలు నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నది . ఉపాధిహామీ నిధులు రూ.5లక్షలతో పాటు గ్రామ పంచాయతీ నిధులు రూ.3లక్షలతో సీసీరోడ్ల నిర్మాణాలను చేపట్టారు. రూ.14లక్షలతో అండర్గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించారు. గ్రామంలో ప్రభుత్వం నూతనంగా రూ.22లక్షలతో రైతువేదిక, రూ. 1.80లక్షలతో పల్లె ప్రకృతివనం, నర్సరీ, రూ.2.50లక్షలతో డంపింగ్యార్డు, రూ.11లక్షలతో వైకుంఠధామం, రూ.9లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ల కొనుగోలు, హరితహారంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా నాటిన సుమారు 2వేల మొక్కలు వేపుగా పెరిగి పచ్చదనాన్ని పంచుతున్నాయి. మండల కేంద్రమైన మద్దూరు నుంచి జనగామ జిల్లాకేంద్రం వరకు డబుల్ రోడ్డును నిర్మించగా.. మద్దూరు నుంచి ముస్త్యాల వరకు ప్రభుత్వం నూతనంగా బీటీరోడ్డును నిర్మించింది
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి..
మండల కేంద్రమైన మద్దూరు గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రత్యేకంగా నిధులను మంజూరు చేయడం సంతోషంగా ఉంది. పల్లెప్రగతి నిధులతో గ్రామంలో మౌలిక వసతులు సమకూరుతున్నాయి. ఇప్పటికే గ్రామంలో సీసీరోడ్ల నిర్మాణం, అండర్గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించాం. గ్రామంలో ప్రతి వీధిలో సీసీ రోడ్డును నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
పారిశుధ్యం, పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ
గ్రామంలోని అన్ని వీధుల్లో ఉన్న తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి, డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాం. ప్రతి రోజూ వీధులను శుభ్రం చేయడం వల్ల గ్రామం అద్దంలా మారింది. రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలను కాపాడుకునేందుకు ట్యాంకర్ సహాయంతో మొక్కలకు నీటిని పోస్తుండడంతో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. గ్రామంలో సీసీరోడ్లతో పాటు అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలతో గ్రామ రూపురేఖలు మారాయి.