చిలిపిచెడ్, జూన్ 23: మండల పరిధిలోని చిట్కుల్ గ్రామం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో దశ మార్చుకున్నది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామంలో నేడు ప్రగతి పనులు పరిగెడుతున్నాయి. గ్రామంలో డంపింగ్ యార్డు నిర్మాణం, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, పచ్చదనం పరిశుభ్రత, నర్సరీ ఏర్పాటు వంటి పలు అంశాల్లో ముందుంటూ గ్రామ రూపురేఖలు మార్చుకుంటున్నది.
పరిఢవిల్లుతున్న పచ్చదనం..
గ్రామాన్ని హరితమయంగా మార్చేందుకు గ్రామంలో రెండు నర్సరీలను ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. ప్రతి ఏటా ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేస్తున్నారు. హరితహారంలో భాగంగామెదక్-సంగారెడ్డి రోడ్డుకు 2వేల మొక్కలు నాటారు. రైతులకు మొక్కలు పంపిణీ చేసి పొలం గట్లపై నాటించారు. దీంతో ఆయా మొక్కలు పెరిగి చెట్లుగా మారి పచ్చదనంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
గల్లీగల్లీకి సీసీ రోడ్లు,పరిశుభ్రంగా డ్రైనేజీలు..
గ్రామంలోని అన్ని వీధుల్లో సీసీ రోడ్లు వేశారు. అలాగే, సీసీ రోడ్డు పక్కన డ్రైనేజీ కాలువను నిర్మించి 100 శాతం పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నంలో పంచాయతీ సిబ్బంది సఫలమయ్యారు. గ్రామంలో వైకుంఠధామంపనులు 90 శాతం పూర్తయ్యాయి. ప్రతి విద్యుత్ స్తంభానికి ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశారు.
గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు..
గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నేరస్తులను తొందరగా గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతాయి. సర్పంచ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గ్రామంలోనిప్రధాన సెంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
తాగునీటి సమస్యకు చెక్..
గ్రామంలో 2 లక్షలు లీటర్ల సామర్థ్యంతో మిషన్ భగీరథ నీటి ట్యాంకులను ప్రభుత్వం నిర్మించింది. ప్రతి రోజు గ్రామంలో భగీరథ నీరు సరఫరా చేస్తున్నారు. దీంతో తాగునీటి సమస్యలు తలెత్తకుండాచెక్పెట్టినైట్లెంది.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..
ప్రభుత్వం చేపట్టిన రెండు విడుత పల్లె ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామంలో నెలకొన్న సమస్యలు తొలగిపోయాయి. గ్రామంలో పచ్చదనం పారిశుధ్యం, ఇంకుడు గుంతలు, సీసీ రోడ్లు, మురుగు కాల్వలతోపాటు పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశాం. అభివృద్ధిలో గ్రామస్తులందరూ భాగస్వాములు అవుతున్నారు. ఇదే స్ఫూర్తితో ఎమ్మెల్యే మదన్రెడ్డి సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.
మా గ్రామం మారింది..
మా గ్రామం ఇంత మారుతుందని కలలో కూడా అనుకోలేదు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ఎంతో గొప్పగా ఉంటున్నాయి. పల్లెప్రగతి రాకముందు ఒక విధంగా ఉన్న గ్రామం ఇప్పుడు పూర్తిగామారిపోయింది.