షాపుల వద్ద ప్రజలు గుంపులుగా ఉండకుండా మార్కింగ్ చేయాలి
నిబంధనలు ఉల్లంఘిస్తే కేసు నమోదు
టెలీ కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఎస్.హరీశ్
మెదక్, మే 22 : జిల్లాలో లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లు, అధికారులను కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. ఉదయం 6 నుంచి 10 గం టల వరకు లాక్డౌన్ సడలింపు ఉన్నా.. చాలా మంది 8 గంటల తర్వాత మార్కెట్ కు గుంపులుగా వస్తూ కరోనా నిబంధనలు పాటించకపోవడం వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశముందన్నారు. ప్రతి షాపు వద్ద గుంపులుగా జనం ఉండకుండా మార్క్ వేసేలా చూడాలని, నిబంధనలు ఉల్లంఘించిన షాపు యజమానులపై కేసులు నమోదు చేయడంతో పాటు దుకాణం సీజ్ చేయాలని సూచించారు. శనివారం వైద్యాధికారులతో పాటు అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల పరిషత్ అధికారులు, ఏపీవోలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ రాబడి తగ్గుతున్నా ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తున్నారని తెలిపారు. వినియోగదారులు భౌతిక దూరం పాటించేలా షాపుల ముందు మార్కు వేయడం లేదని.. ఇకపై వ్యాపారస్తులు నిబంధనలు పాటిం చాలని ఆదేశించారు. వాహనంపై ఒక్కరు, ఆటోలో ముగ్గు రు కంటే ఎక్కువ వెళ్లకుండా చూడాలన్నారు. జ్వర సర్వే చేపట్టి కరోనా లక్షణాలున్న వారిని గుర్తించి మందుల కిట్ ఇవ్వడంతోపాటు ఐసొలేషన్లో ఉండేలా చూడాలన్నారు. ప్రభత్వు ఆస్పత్రుల్లో ఆక్సిజన్, మందుల కొరత లేదని, అన్ని సౌకర్యాలు ఉన్నాయని ప్రజలకు వివరించాలన్నారు.
150 నుంచి 200 మందికి పని ..
నీటి పారుదలశాఖ సహాయంతో గ్రా మాల్లో ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి పనులు గుర్తించి ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 150 నుంచి 200 మందికి పని కల్పించాలని ఎంపీడీవోలు, ఏపీవోలకు సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి పంచాయతీలో కూలీలకు పనులు కల్పించడంతో పాటు డబ్బుల చెల్లింపు వివరాలు అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో 24లక్షల మొక్కలు నాటడానికి గుం తలు తీసే పనులు చేపట్టాలని సూచించారు. టెలీ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ రమేశ్, జడ్పీ సీఈవో శైలేష్, డీఆర్డీవో శ్రీనివాస్, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఉల్లంఘిస్తే కేసులు
జిల్లా లాక్డౌన్ కఠినంగా అమలు
జిల్లాలో 1387 మందికి జరిమానాలు
ద్విచక్రవాహనంపై ఒక్కరికి మించి వెళ్లరాదు
జిల్లా ఎస్పీ చందనదీప్తి
మెదక్, మే 22 : జిల్లాలో లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తామని జిల్లా ఎస్పీ చందనదీప్తి తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ మెదక్ జిల్లాలో నిబంధనలు పా టించని 1387 మందికి జరిమానా విధించామని తెలిపారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు బయటకు రాకుండా ఉండాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా కరోనా వ్యాధి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్న సూచనలు, నిబంధనలను కూడా పాటించాలని సూచించారు. ప్రభుత్వం కల్పించిన మినహాయింపులను ఆసరాగా తీసుకొని కొందరు పదే పదే బయటకు వస్తున్నారని, వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. అనవసరంగా బయట తిరుగుతున్న వారి వాహనాలను సీజ్ చేయడమే కాకుండా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాక్డౌన్ ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఉంటుందని తెలిపారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని, సడలింపు సమయంలోనే నిత్యావసర సరుకులు, మందులు తీసుకొని వెళ్లాల్సి ఉంటుందన్నారు.