మెదక్, జూన్ 21 : మహిళలందరూ ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆర్థిక స్వాలంభన సాధ్యమని, మహిళా సాధికారత సాధ్యమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం నాబార్డు సాయంతో రూ. 5 లక్షల నిధులతో జిల్లాకేంద్రం మెదక్ పట్టణంలో ఏర్పాటు చేసిన మంజీరా రూరల్ మార్టును ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగ డానికి ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇతోధికంగా ఆర్థికసాయం చేస్తుందన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఆడపిల్లలను చదివించాలని సూచించారు. వారు చదువుకుంటేనే సమాజంలో గౌరవంతోపాటు ఆర్థికంగా ఎదిగి, ధైర్యంగా బతకగలుగుతారని పేర్కొన్నారు. మెదక్ నియోజకవర్గానికి సంబంధించి మహిళలు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎదగడానికి ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారని, వారికి తన పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. నాబార్డు సాయంతో ఏర్పాటు చేసిన మంజీరా మార్టులో అన్ని రకాల వస్తువులు ఉన్నాయని, చేతి ద్వారా తయారు చేసిన వస్తువులకు నాణ్యతతోపాటు తక్కువ ధరకే లభిస్తాయన్నారు. మహిళలు ఏర్పాటుచేసిన మంజీరా రూ రల్ మార్టును ఆదర్శంగా తీసుకొని గ్రామాల్లో కూడా ఇలాం టి దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం మంజీరా రూరల్ మార్టులో విస్తరాకులతో పాటు ఇతర వస్తువులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్ కొనుగోలు చేశారు.
కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్, అదనపు డీఆర్డీవో భీమయ్య, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, మెదక్ ఎంపీపీ యమునాజయరాంరెడ్డి, కౌన్సిలర్లు, ఐకేపీ ఏపీఎం ఇందిర పాల్గొన్నారు.