దేశంలోనే తొలిసారిగా ప్రయోగం
హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): మన ఇండ్లలో జరిగే వివాహాది శుభకార్యాలకు ఇకపై మాంసం గురించి, దాని నాణ్యత గురించి చింతించవలసిన పనిలేదు. ప్రభుత్వమే మీఇంటి వద్దకు వాహనంలో మేకలు లేదా గొర్రెలను పంపి, అక్కడే వధించి నాణ్యమైన మాంసం సరఫరా చేయనుంది. ఇందుకోసం పశు సంవర్ధకశాఖ కసరత్తు చేస్తున్నది. దీనిపై హైదరాబాద్లోని జాతీయ మాంసం పరిశోధన కేంద్రం(ఎన్ఆర్సీఎం) పరిశోధనలు చేస్తున్నది. ఇప్పటికే వాహనం నమూనా సిద్ధమైంది. త్వరలోనే ఈ ప్రయోగాన్ని ప్రభుత్వానికి నివేదించనున్నారు. మొబైల్ షీప్ స్లాటర్స్ విధానం అమల్లోకి వస్తే దేశంలోనే తొలిసారిగా ప్రయోగం చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలువనుంది. ఇప్పటికే పలు అంశాల్లో దేశానికి మార్గదర్శకంగా నిలిచిన తెలంగాణ,ఇప్పుడు మరో అంశంలోనూ మార్గదర్శిగా నిలువనున్నది.
సరఫరా ఎలా…
ప్రస్తుతానికి మొబైల్ షీప్ స్లాటర్స్ను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. డిమాండ్ను బట్టి ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తామని చెబుతున్నారు. ఈ విధానంలో.. శుభకార్యాలు జరుపుకొనేవారు చేసే ఆర్డర్ను బట్టి.. వారి ఇంటివద్దకే వాహనాన్ని, అవసరమైన మేకలు, గొర్రెలను తీసుకెళ్లి, అక్కడే వాటిని వధించి మాంసం అందిస్తారు. ఇందుకోసం నిపుణులైన వారిని నియమించుకుంటారు. మేకలను వధించినప్పుడు వచ్చే వ్యర్థాలను ఏం చేయాలనే దానిపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. దీనిపై స్పష్టత రాగానే వాహనాల మోడల్ను ప్రభుత్వానికి పంపనున్నారు. ఒక్కో వాహనం ఖరీదు రూ. 8-10 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నాణ్యమైన మాంసం సరఫరా లక్ష్యంగా..
మాంసం ఉత్పత్తి, వినియోగంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది. నాణ్యమైన మాంసం లభ్యతపై అనేక సందేహాలు ఉన్నాయి. అధికారుల దాడుల్లో కల్తీ మాంసం పట్టుబడుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆధ్వర్యంలో వినియోగదారులకు నాణ్యమైన మాంసం అందించాలని పశు సంవర్ధకశాఖ నిర్ణయించింది. ముందుగా ఈ వాహనాల ద్వారా ఫంక్షన్లు, పెండ్లిళ్లకు మాత్రమే సరఫరా చేయనున్నారు. ఆ తర్వాత ఇంటింటికీ విక్రయించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. తొలిదశలో గ్రేటర్ హైదరాబాద్తో పాటు జిల్లాకు ఒకటి లేదా రెండు స్లాటర్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత పరిస్థితులను బట్టి సంఖ్యను పెంచనున్నారు. ఇప్పటికే మత్స్యశాఖ మొబైల్ ఫిష్ అవుట్ లెట్స్ను ప్రారంభించింది. ఇద్దరు ముగ్గురు కలిసిన గ్రూపులకు 100కు పైగా వాహనాలను పంపిణీ చేసింది. ఆ ప్రక్రియ విజయవంతం కావడంతో ఇప్పుడు షీప్ స్టాటర్స్పై దృష్టి పెట్టారు.