హవేళీఘనపూర్, జూలై 20:అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న చిన్న పల్లె అది. అటవీ ప్రాంతంలో ఉండడంతో సమస్యలు ఎవరికీ పట్టనట్లు ఉండేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రగతి ఆ పల్లె దశను మార్చేసింది. హవేళీఘనపూర్ మండల పరిధిలోని లింగ్సాన్పల్లి ఇప్పుడు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ ఆదర్శంగా నిలుస్తున్నది.
అటవీ ప్రాంతంలో ఉండే లింగ్సాన్పల్లి ఓ చిన్న గ్రామం కావడంతో ఉమ్మడి రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో సమస్యలతో సతమతమయ్యేది. కానీ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నూతనంగా సీసీ రోడ్లను ఏర్పాటు చేయడంతో పాటు పంచాయతీ కార్మికులు నిత్యం శుభ్రం చేస్తున్నారు. అంతేకాకుండా చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తుండడంతో గ్రామం పరిశుభ్రంగా మారింది. గ్రామంలో ఎప్పుడూ కూడా ఇంతలా అభివృద్ధి పనులను చూడని ప్రజలు ప్రగతి పనులపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీసీ రోడ్ల నిర్మాణంతో తీరిన ఇబ్బందులు
గతంలో ఆయా వీధుల్లో మట్టి రోడ్లతో కొద్దిపాటి వర్షం కురిసినా ప్రజలు నడువలేని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ప్రభుత్వం నిధులు మంజూరు చేసి సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టింది. అంతేకాకుండా పంచాయతీ సిబ్బంది ప్రతి రోజూ ఆయా రోడ్లను శుభ్రం చేస్తూ పరిశుభ్ర గ్రామంగా నిలుపుతున్నారు.
పరిశుభ్రమైన పల్లె..
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామానికి ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్ను కొనుగోలు చేశారు. నిత్యం గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ చెత్తను సేకరిస్తూ డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. చెత్తసేకరణలో సర్పంచ్ మహిపాల్రెడ్డి, పంచాయతీ పాలకవర్గం ప్రజలను చైతన్యం చేయడంతో తడి, పొడి చెత్తను వేరుచేసి చెత్త ట్రాక్టర్కు వేస్తున్నారు. అంతేకాకుండా గ్రామంలోని మురుగు కాలువల్లో చెత్తచెదారంతో పేరుకు పోకుండా పారిశుధ్య కార్మికులు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. దీంతో గ్రామం పరిశుభ్రంగా కనిపిస్తూ వ్యాధులకు దూరంగా ఉంటున్నదని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆకట్టుకుంటున్న పచ్చదనం..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా లింగ్సాన్పల్లి గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టారు. పల్లె ప్రగతిలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో నాటిన వివిధ రకాల మొక్కలు ఆకట్టుకుంటున్నాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీలో పూలు, పండ్లు, ఔషధ మొక్కలను పెంచుతున్నారు. గ్రామ పంచాయతీ పాలక వర్గం నాటిన మొక్కలతో పాటు ప్రకృతి వనం, నర్సరీలో పెంచుతున్న మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీటిని పోయిస్తూ సంరక్షణ చర్యలు చేపడుతున్నారు.
ప్రజల సాకారంతో మరింత అభివృద్ధి..
ప్రజలు కేవలం పంచాయతీ వారు చేస్తారనే కాకుండా తమవంతుగా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తేనే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ప్రజలకు ఎలాంటి అవసరాలున్నా వాటిని తీర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.
గ్రామ రూపురేఖలు మారాయి..
గతంలో గ్రామంలో మురుగు కాలువలు, సీసీ రోడ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారు. కానీ, ప్రస్తుతం సీసీ రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణం వల్ల ప్రజలకు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. పల్లె ప్రగతితో గ్రామ రూపురేఖలు మారిపోయాయి.