మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 11 : నూతనంగా ఏర్పడిన మండల కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా ఏర్పడిన మండలాల్లో పీహెచ్సీ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఈ నెలాఖరు వరకు జిల్లా వ్యాప్తంగా కొవిడ్ టీకాలు పూర్తి చేయాలని సూచించారు. తూఫ్రాన్, మనోహరాబాద్ మండలాల్లో ఆర్అండ్బీ అధికారుల నిరక్ష్యంతో పనులు నిలిచిపోయాయని, త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 4,10,783 మందికి వ్యాక్సిన్ ఇచ్చామని, నార్సింగ్లో నూతన పీహెచ్సీ కేంద్రం శిథిలావస్థకు చేరిందని, దీంతో వాటిలో సేవలు నిలిపివేశామని జడ్పీటీసీ కృష్ణారెడ్డి సభ దృష్టికి తీసుకెళ్లారు. రామాయంపేట ప్రభుత్వ దవాఖానలో అవసరమైన వైద్యులను నియమించాలని, వైద్యులు లేకపోవడంతో మెదక్, కామారెడ్డికి ప్రజలు వెళ్లాల్సి వస్తుందని నిజాంపేట జడ్పీటీసీ విజయ్కుమార్ తెలిపారు. మొదటి డోస్గా కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి రెండో డోస్ ఇవ్వడం లేదని, సకాలంలో వ్యాక్సిన్ తెప్పించాలని చేగుంట ఎంపీపీ శ్రీనివాస్ డీఎంహెచ్ను కోరారు. బృహత్ వనాల కోసం మెదక్, హవేళీఘనపూర్ మండలాల్లో ప్రభుత్వ భూములు లేవని, అటవీ ప్రాంతాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి సభ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా వ్యవసాయధికారి పరశురాం నాయక్ మాట్లాడుతూ రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. 57 ఏండ్లు నిండిన వారు ఆసరా పింఛన్కు ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీలో రూ.166 కోట్లు అందజేసి రాష్ట్రంలో జిల్లా 3వ స్థానంలో నిలిచిందన్నారు. ట్రాన్స్కో ఎస్ఈ జానకీరాం మాట్లాడుతూ జిల్లాలో రూ.14 కోట్లతో కొత్తగా 9 ఉప కేంద్రాలు నిర్మించామన్నారు. సమావేశంలో కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, జడ్పీ సీఈవో శైలేశ్, జిల్లా అధికారులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.