పల్లెల్లో ప్రగతి పరవళ్లు తొక్కుతున్నది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పల్లెప్రగతి కార్యక్రమంతో రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్ గ్రామ రూపురేఖలే మారిపోయాయి. హరితహారంలో భాగంగా గ్రామంలో నాటిన మొక్కలు పెరిగి ఆహ్లాదాన్నిస్తున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం పార్కును తలపిస్తున్నది. డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి చెత్త సేకరణ చేపట్టడంతో గ్రామం పరిశుభ్రంగా దర్శనమిస్తున్నది. గ్రామంలోని అన్ని సమస్యలను పరిష్కరించుకుని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుండడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలవుతున్నాయి. అందరి ప్రోత్సాహంతో ప్రగతి పథం వైపు గ్రామం పయనిస్తున్నది.
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
గ్రామంలో సర్పంచ్ పంచాయతీ తో ప్రతి ఇంటికి వెళ్లి మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలపై అవగాహన కల్పించారు. ఇంటింటికీ మరుగుదొడ్డి, ఇంకుడు గంతను నిర్మించుకునేలా చర్యలు చేపట్టారు. రూ.2లక్షలతో డంపింగ్యార్డు నిర్మించారు. ప్రతి రోజు పంచాయతీ ట్రాక్టర్తో పారిశుధ్య కార్మికులు ఇంటింటికీ తిరుగుతూ తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. ముగ్గురు పారిశుధ్య కార్మికులతో ప్రతిరోజు గ్రామంలోని ప్రధాన రహదారులతో పాటు మురికి కాల్వలను శుభ్రం చేస్తున్నారు. గ్రామంలో నూతనంగా విద్యుత్ కేబుల్ను సరిచేయడంతో పాటు అవసరం ఉన్న చోట విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించారు. 2వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో 60 వేల లీటర్ల సామర్థ్యంతో మంచి నీటి ట్యాంకును నిర్మించి మిషన్ భగీరథ నీటిని నల్లాల ద్వారా అందరికీ అందిస్తున్నారు. అంతిమ సంస్కారాల కోసం రూ.11లక్షలతో గ్రామ శివారులో వైకుంఠధామాన్ని నిర్మిస్తున్నారు.
గ్రామస్తుల సహకారంతోనే అభివృద్ధి
పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. మౌలిక వసతుల కల్పన కోసం గ్రామస్తుల సహకారం చాలా బాగుం ది. డంపింగ్ యార్డులో తడి, పొడి చెత్తను వేరుచేసి ఎరువులను తయారు చేస్తున్నాం. గ్రామంలో దహన సంస్కారాల కోసం వైకుంఠధామాన్ని నిర్మిస్తున్నాం.
– సర్పంచ్ భండారి మహేందర్రెడ్డి
కొత్త పంచాయతీలో అన్ని వసతులు..
సర్పంచ్ యువకుడు కావడంతో గ్రామంలో కొత్త గా ఎన్నో పనులు చేపట్టడం జరిగింది. డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, మిషన్ భగీరథతో తాగునీటిని గ్రామంలో అందరికీ అందిస్తున్నాం.