రామాయంపేట, జూన్ 16 : రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువుల అందించడం కోసమే పోలీస్, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నామని జిల్లా టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు ఏడీఏ సురేఖ, సీఐ మురళి అన్నారు. బుధవారం రామాయంపేటలోని విత్తన ప్లాంట్లతోపాటు ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ దుకాణాల్లో నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లైసెన్స్ ఉన్నవారే విత్తనాలు, ఎరువులు విక్రయించాలన్నా రు. లైసెన్స్ లేకుండా దొంగచాటున విత్తనాలు విక్రయిస్తే 1983 చట్టం ప్రకారం శిక్షలు విధిస్తామన్నారు. దుకాణాల లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. వారి వెంట రామాయంపేట డివిజన్ సహాయ వ్యవసాయ సం చాలకులు వసంత సుగుణ, పోలీసులు, మండల వ్యవసాయ అధికారి రాజ్నారాయణ ఉన్నారు.
నిజాంపేటలోని దుకాణాల్లో తనిఖీలు..
నిజాంపేట, జూన్ 16 : రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను విక్రయించాలని మండల ఏవో సతీశ్ ఫర్టిలేజర్ దుకాణ యజమానులకు సూచించారు. నిజాంపేటలోని పలు విత్తనాలు, ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ ప్రభుత్వ లైసెన్స్ పొందిన దుకాణాల్లోనే రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని, విధిగా రసీదులు తీసుకోవాలని సూచించారు. వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా విత్తనాలు, ఎరువుల స్టాక్ వివరాలు, ధరల పట్టికను ఏర్పాటు చేయాలని డీలర్లకు సూచించారు. వారి వెంట డీలర్లు, రైతులు ఉన్నారు.
నకిలీ విత్తనాలు అమ్మితే ఫిర్యాదు చేయండి..
చేగుంట, జూన్ 16 : ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే అధికారులకు ఫిర్యాదు చేయాలని టాస్క్ఫోర్స్ సీఐ మురళి రైతులకు సూచించారు. మండల కేంద్రమైన చేగుంటలోని విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో నర్సాపూర్ ఏడీఏ సురేఖ, రామాయంపేట ఏడీఏ వసంత సుగుణ, చేగుంట వ్యవసాయ శాఖ అధికారి జయశంకర్తో కలిసి సీఐ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విత్తనాలు అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన వివరాలను డీలర్లు రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. విత్తనాలు అనధికారికంగా నిల్వ చేయరాదని చెప్పారు. నకిలీ విత్తనాలుగా అనుమానం ఉంటే రైతులు వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. దుకాణాల వద్ద ధరల పట్టికను ఏర్పాటు చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.