మిరుదొడ్డి, జూన్ 16 :తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు పోయి.. నేడు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఆనందంగా ఉంటున్నారని, కాళేశ్వరం నీళ్లతో పుట్ల కొద్ది ధాన్యాన్ని పండించి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం మిరుదొడ్డిలో మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం జరిగిం ది. చైర్మన్గా వల్లాల సత్యనారాయణ, వైస్ చైర్మన్గా సల్లూరి మల్లేశం, డైరెక్టర్లుగా గుండమైన అభిలాశ్, గజభీంకార్ శ్రీనివాస్, రామగల్ల మల్లేశం, లింగనగల్ల పరశురాములు, కుర్ర అంజవ్వ, మజ్జిగ నర్సింహారెడ్డి, వరగంటి హరికృష్ణ, సందిరి రాజిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ హాజరై ఏఎంసీ నూతన పాలక వర్గాన్ని అభినందించారు. అనంతరం 15 మంది లబ్ధిదారులకు రూ.6,73 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు.
అందె జడ్పీ పాశాలకు చెందిన 21 మంది 10వ తరగతి విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బ్యాగులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారు. సీఎం కేసీఆర్ చొరవతో నేడు గోదావరి జలాలతో కూడవెల్లి వాగు అల్వాల, అందె, మిరుదొడ్డి, లింగుపల్లి, మల్లుపల్లి కాసులాబాద్, మోతె, రుద్రారం, భూంపల్లి గ్రామాల మీదుగా రెండు నెలల పాటు మండుటెండల్లో కూడా గళగళ పారిందన్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ హయాంలోప్రజలకు తాగు నీరు.. సాగు నీరు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కానీ, నేడు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి సాగునీరు అందించడమే కాకుండా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఉండొద్దనే లక్ష్యంతో మిషన్భగీరథ పథకంతో తాగునీటిని అందచారని తెలిపారు. ఒక్క మిరుదొడ్డి మండలంలోనే 21 కొనుగోలు కేంద్రాల్లో మొత్తం 5,500 మంది రైతుల వద్ద రూ.56కోట్ల విలువ చేసే ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు.
40, 50 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాంలను నిర్మిస్తాం..
గతంలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఉన్నప్పుడు మిరుదొడ్డిలో 5వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంను నిర్మించామన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కోరిక మేరకు సీఎం కేసీఆర్ ఆదేశానుసారం దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో 40, 50 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాంలను నిర్మిస్తామని తెలిపారు. గ్రామాల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ హాళ్లను త్వరతోనే పూర్తి చేయడానికి నిధులను మంజూరు చేస్తామన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో గతంలో మంజూరు చేసిన బీటీరోడ్లే కాకుండా మిగిలిన రోడ్లకు ప్రతిపాదనలు ఎంపీ ప్రభాకర్రెడ్డి ఇవ్వగానే రోడ్ల నిర్మాణాలకు నిధులను మంజూరు చేస్తామన్నారు. ఈ నెల 15, 16వ తేదీల్లో మొత్తం 35 లక్షల 2,161 మంది రైతులకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.16 వందల 69 కోట్లను ఖాతాల్లో జమచేసిందన్నారు.
రైతులు ఇతర పంటలపై దృష్టి సారించాలి..
రైతులు వరి పంటనే కాకుండా పత్తి, కంది ఇతర పంటల పై దృష్టి సారించాలని సూచించారు. రైతులు కంది, పత్తి, పామాయిల్ పంటలను వేసి ఆర్థికంగా లాభాలను పొందాలన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని నాయీ బ్రాహ్మణులు, రజకుల కష్టాల నుంచి గట్టెక్కించడానికి సబ్సిడీ పై కరెంట్ను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్నదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శర్మ, ఎంపీపీ గజ్జెల సాయిలు, జడ్పీటీసీ సూకురి లక్ష్మీలింగం, పీఏసీఎస్ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగాల వెంకట్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు తుమ్మల బాల్రాజు, ఎంపీటీసీ సుతారి నర్సింహులు, దుబ్బాక నియోజకవర్గం ప్రజాప్రతి నిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.