మెదక్ మున్సిపాలిటీ, మే 16: రాష్ట్రంలో కరోనా నియంత్రణకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపడుతున్నదని సీఎం కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైరస్ నియంత్రణ, ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు సమష్టిగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వైరస్ నివారణ చర్యలు రాష్ట్రంలోనే బాగున్నాయన్నారు. ఇంటింటికీ జ్వర సర్వేతో పేదలకు ఎంతో మేలు జరుగుతున్నదని వివరించారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య వివరాలు సేకరించడం మంచి కార్యక్రమన్నారు. సర్వేతో ఎవరికి ఏ వ్యాధి లక్షణాలు ఉన్నాయో తెలిసిందన్నారు. కరోనా లక్షణాలు ఉంటే ప్రభుత్వం ఉచితంగా మందులు అందజేస్తున్నదన్నారు. ఇంటింటా సర్వేలో హెల్త్ సిబ్బంది, ఆశవర్కర్లు, అంగన్వాడీల సేవలు ఎనలేనివని కొనియాడారు. వైద్య సిబ్బందికి ఆరోగ్య సమస్యలు వివరించాలని సూచించారు. కరోనా నివారణకు సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్షిస్తూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. వైరస్ నియంత్రణకు చివరి అస్త్రంగా లాక్డౌన్ అమలు చేశారన్నారు. కరోనా కష్ట కాలంలోనూ సం క్షేమ పథకాలను సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
జిల్లాలోని దవాఖానల్లో ఆక్సిజన్తో కూడిన బెడ్లు..
జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో కరోనా చికిత్స కోసం ఆక్సిజన్తో కూడిన బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దన్నారు. జిల్లాలో ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలు విచ్చలవిడిగా డబ్బులు గుంజుతున్నారని తమ దృష్టికి వచ్చిందని, జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారులు ప్రైవేట్ దవాఖానలను కంట్రోల్ చేయాలన్నారు. జిల్లాలో ఆక్సిజన్ కొరత లేదన్నారు. ఇటీవల మంత్రి హరీశ్రావు నిర్వహించిన సమీక్షలో సిటీ స్కాన్ రూ.2వేలకు తీయాలని ఆదేశిస్తే వారు సానుకూలం గా స్పందించారన్నారు. రోనాతో ఏవైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
నిరుపేదలకు సర్కార్ అండగా..
నిరుపేద ప్రజలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ అని ఎమ్మెల్సీ, సీఎం రాజకీయ కార్యదర్శి శేరి సుభాశ్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కూచన్పల్లి ఎమ్మెల్సీ వ్యవసాయ క్షేత్రంలో నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాలకు చెందిన 30 మంది లబ్ధిదారులకు రూ.19.80లక్షల చెక్కులను బాధిత కుటుంబీకులకు అందజేశారు. ఆయన వెంట కూచన్పల్లి సర్పంచ్ దేవాగౌడ్, మాజీ సర్పంచ్ కిరణ్గౌడ్, ఉప సర్పంచ్ బయ్యన్న, నాయకులు వెంకయ్య ఉన్నారు.