రాయికోడ్, ఏప్రిల్ 14: మండల పరిధిలోని మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం పడి, రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించింది. గ్రామాల్లో వందల ఎకరాల్లో జొన్న పంటలు నేలవాలాయి. పలు ప్రాంతాల్లో చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. మండలంలోని వివిధ గ్రామాల్లో 450ఎకరాల్లో జొన్న పంటలకు నష్టం వాటిలి నట్లు జిల్లా అధికారులు తెలిపారు. రైతులు పంటలను నష్టపోతే సంబంధిత ఏఈవోలకు సమాచారం అందించాలన్నారు. రాయికోడ్ డివిజన్ వ్యవసాయశాఖ ఏడీఏ హరిత మాట్లాడుతూ… వట్పల్లి, మునిపల్లి మండలాల్లో ఎలాంటి నష్టం జరుగలేదన్నారు. రాయికోడ్ మండలంలో మాత్రమే 450 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు చెప్పారు.
హత్నూరలో 41.6మిల్లీ మీటర్లు
సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 14: జిల్లాలో ఒక్కసారిగా వా తావరణం చల్లబడింది. మంగళవారం రాత్రి జిల్లావ్యాప్తంగా ఓ మోస్తారు వర్షం కురిసింది. జిల్లాలో సరాసరి వర్షపాతం 13.2 మిల్లీ మీటర్లు నమోదు కాగా, అత్యధికంగా హత్నూర మండలంలో 41.6 మిల్లీ మీ టర్ల వర్షం కురిసింది. కంగ్టి మండలం మినహాయించి జిల్లాలోని మిగతా 26మండలా ల్లో వర్షపాతం నమోదైంది. చౌటకూర్లో 31.3 మిల్లీ మీటర్ల వర్షం కురవగా, సంగారెడ్డి, కంది మండలాల్లో 25.4 మిమీ లు, సదాశివపేట, సిర్గాపూర్లలో 21.4 మిమీలు, కోహీర్, రాయికోడ్లలో 21మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. కొండాపూర్లో 19.4మిమీలు, పటాన్చెరులో 19మిమీలు, పుల్క ల్ 15.8మిమీలు, అమీన్పూర్, ఆర్సీ పురంలో 12.4మిమీలు, అందోల్లో 11.6మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
ఉరుములు, మెరుపులతో వర్షం
లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. సంగారెడ్డితో పాటు వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రోజులుగా జిల్లాలో ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరైన జిల్లావాసులు ఒక్కసారిగా ఉపశమనం పొందారు. వాతావరణం పూర్తిగా చల్లబడడంతో మరోవైపు కరోనా రక్కసి విజృంభించే ప్రమాదమూ లేకపోలేదనే పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలకు చేతికొచ్చిన పంటలు దెబ్బతింటున్నాయని పలువురు రైతన్నలు వాపోతున్నారు.