మెదక్, జూలై 13 : ప్రతి మండల కేంద్రంలో 10 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న బృహత్ పల్లె ప్రకృతి వనాలను యాదాద్రి మోడల్లో సుందరంగా తీర్చిదిద్దాలని మెదక్ కలెక్టర్ హరీశ్ అధికారులకు సూచించారు. బృహత్ పల్లెప్రకృతి వనాలు ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించి అందులో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈనెల 20లోగా ట్రెంచ్లు ఏర్పాటు చేయాలన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పల్లెప్రగతిలో 550 ఆవాస ప్రాంతాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, భూమి లభ్యత, ఇతర కారణాల వల్ల ఏర్పాటు చేయలేకపోయామని తెలిపారు. పట్టణంలోని స్టేడియంలో మిగిలిపోయిన రేలింగ్, పెయింటింగ్, లైటింగ్ తదితర పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో చివరి దశలో ఉన్న రైతు వేదికలను పది రోజుల్లోగా పూర్తి చేసి వాడుకలోకి తీసుకురావాలని చెప్పారు. జిల్లాలో వైకుంఠధామాల నిర్మాణ పనులు పక్షం రోజుల్లో పూర్తి చేయాలని, లేకపోతే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చాలా ప్రాంతా ల్లో సర్పంచ్లే పనులు చేపట్టారని, కానీ పనులు సాగడం లేదని అసహనం వ్యక్తం చేశారు. సర్పంచ్లు, కాంట్రాక్టర్లు పని చేయకపోతే కాంట్రాక్ను వెంటనే రద్దు చేసి ఇతరులతో పనులు పూర్తి చేయించాలని చెప్పారు. పంచాయత్రాజ్ ఇంజినీరింగ్ అధికారులు, మండల పరిషత్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పనులు పూర్తయిన సెగ్రిగేషన్, వైకుంఠధామాల చుట్టూ బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్కుమార్, పంచాయతీరాజ్ ఈఈ రామచంద్రారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి పరశురాంనాయక్, ఆర్డీవోలు సాయిరాం, ప్రకాశ్, మండల పరిషత్ అధికారులు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.