మెదక్ మున్సిపాలిటీ, జూలై 13 : ప్రభుత్వ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సూచించారు. జడ్పీ కార్యాలయంలో మంగళవారం 6వ స్థాయీ సంఘం సమావేశం (సాంఘిక సంక్షేమం) రామాయంపేట జడ్పీటీసీ సంధ్య అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, వెనుకబడిన తరగతులు సంక్షేమం, అల్పా సంఖ్యాకవర్గాల సంక్షేమంపై ఆయా శాఖాల అధికారులు నివేదికలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని, ఈ పథకాల అమలులో అధికారులు చొరవ చూపాలన్నారు. ప్రతి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వం రుణాలు అందజేస్తున్న బ్యాంకు అధికారులు కఠిన నిబంధనలు పెట్టడంతో చాలా మందికి రుణాలు అందకుండా పోతున్నాయన్నారు. రూ.లక్ష లోపు రుణాలకు ఎలాంటి నిబంధనలు పెట్టకుండా బ్యాంకర్లు ఇవ్వాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనతో రూ.1200 కోట్లతో ‘దళిత సాధికారత పథకం’ ప్రకటించారన్నారు. బ్యాంకులకు సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారులకే రుణా లు అందేలా ఈ పథకం లక్ష్యమన్నారు. నిరుపేద దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయాలన్నదే సీఎం నిర్ణయమన్నారు. మొద టి విడుతగా నియోజకనర్గానికి 100 కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తామని తెలిపారు. దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘దళిత సాధికారత పథకం’ ఆదర్శంగా నిలిచి దళితులు జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు.
రైతు బీమా చెల్లింపులో జాప్యం తగదు..