మెదక్, జూలై 13 : మెదక్ జిల్లాలో వరి పంట వానకాలం, యాసంగి సాగు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ కూలీల కొరత చాలా ఎక్కువగా ఉంది. ఒక వేళ కూలీలు లభించినప్పటికీ చిన్న, సన్నకారు రైతులు భరించలేని కూలీల రేట్లు పెను సమస్యగా మారాయి. దీంతో వ్యవసాయ పనులకు ఆటంకం కలిగి రైతుకు సాగు ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గుతున్నది. నూతన విధానంలో సాగు ఖర్చును తగ్గించి వరి సాగును మరింత లాభదాయకంగా చేయడం అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు అధిక శ్రమతో కూడిన దమ్ము చేసి నాట్లు వేసే పద్ధతికి ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంభించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిలో భాగంగా వరి నాట్లు వేసి పండించే సాంప్రదాయ పద్ధతి కన్నా విత్తనాలు నేరుగా దమ్ము చేసిన పొలంలో వెదజల్లే పద్ధతిలో సాగు చేయడంతో కాలాన్ని కోల్పోకుండా సకాలంలో వరి పంట సాగు చేసుకొని మంచి దిగుబడులు సాధించి సాగు ఖర్చులు తగ్గించుకొని అధిక ఆదాయాన్ని పొందుతున్నారు.
మెదక్ జిల్లాలో 500 ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో..
మెదక్ జిల్లాలోని 21 మండలాల్లో 500 ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో వరి సాగును రైతులు చేస్తున్నారు. ప్రస్తుతం భూగర్భ జలాలు పెరుగడంతో రైతులు వరి పంట వైపు మొగ్గు చూపడంతో వరి విస్తీర్ణం దాదాపుగా రెండింతలైంది. ఈ ప్రస్తుత తరుణంలో దమ్ము చేయడానికి, నారు పెంపకానికి, నారు వేయడానికి అదే విధంగా కలుపు నివారణ కోసం మహిళా కూలీలు, రైతులపై ఎక్కువగా ఆధారపడడంతో కూలీల కొరతతో పాటు ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుండడంతో రైతుకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ వానకాలంలో వెదజల్లే పద్ధతిలో వరి పంట వేసే విధానాన్ని రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా ఈ సారి విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నది. మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలంలోని రాయిలాపూర్, కోనాపూర్, కాట్రియాల, లక్ష్మాపూర్ గ్రామాల్లో సుమారుగా 20ఎకరాల్లో నేరుగా వెదజల్లే పద్ధతిలో వరి పంట సాగైంది. అంతేకాకుండా వెల్దుర్తి మండలంలో ఓ రైతు 40 ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో వరి పంట సాగు చేశారు. హవేళీఘనపూర్ మండలంలో కూడా రైతులు వెదజల్లే పద్ధతిలో వరి పంటను సాగు చేశారు.
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ దిగుబడి..
వెదజల్లే విధానం ద్వారా పంట ఏపుగా పెరుగడంతో పాటు దిగుబడి ఎక్కువగా వస్తుంది. కూలీల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. నారుపోసే అవసరం ఉండదు కాబట్టి సాగు సులువుగా జరుగుతుంది. సాంప్రదాయ పద్ధతిలో ఎకరాకు 40 నుంచి 50 కిలోల విత్తనాలు వాడితో ఈ విధానంలో ఎకరానికి 12 నుంచి 14 కిలోలు మాత్రమే.. ఈ విధానంలో తెగుళ్ల సమస్య అధికంగా ఉండదు. నీటి వినియోగం కూడా తక్కువగా ఉండడంతో పాటు పంట కాలం తక్కువగా ఉంటుంది. నాటు వేసే అవసరం ఉండదు కాబట్టి విత్తనాలు కూడా తక్కవగా అవసరం ఉంటుంది. ఈ పద్ధతిలో ఒక రైతు ఒక రోజులో మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు చల్లుకోవచ్చు. వెద పద్ధతి ద్వారా సుమారు ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.12 వేల పెట్టుబడి ఖర్చు తక్కువగా అవుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
ప్రతి ఒక్కరూ ఈ పద్ధతి పాటించాలి..
డ్రమ్ సీడర్ ద్వారా విత్తనాలు విత్తుకుంటే సమాంతరంగా భూమిలో విత్తనాలు పడతాయి. ఇక 4సెం.మీ. దూరంలో విత్తనాలు పడడంతో పాటు ఎదగడంతో వాటిని అన్ని రకాల సాగు యోగ్యమైన నీరు, గాలి, మందు, సూర్యరష్మి క్రమం తప్పకుండా అందుతుంది. ఈ పద్ధతితో కూలీల బెడద నుంచి రైతులు విముక్తి పొందే అవకాశం ఉంది. సాధారణం కంటే 15రోజుల ముందే దిగుబడి చేతికి వస్తుంది. దీంతో అటు రైతుకు మేలు జరగడంతో పాటు సాగులో కలిగే ఇబ్బందులను పూర్తిగా అధిగమించి ముందుకు సాగే అవకాశం ఉన్నది. ప్రతి ఒక్కరూ ఈ పద్ధతిని పాటించి, లాభాలు పొందాలని సూచిస్తున్నాం.
అధికారుల ప్రోత్సాహంతో..
నాకు ఉన్న కొంత భూమిలో ఒక ఎకరాలో కొత్తగా డ్రమ్ సీడర్ పద్ధతి ద్వారా వరి సాగు చేశా. ఈ పద్ధతి సాగు కోసం అవసరమైన డ్రమ్ సీడర్ను అధికారుల సలహాతో కొన్నా. ఈ పద్ధతి ద్వారా కూలీలు లేకుండా సొంతంగా విత్తనాలను విత్తుకునే వెసలుబాటు ఉంది. దీనిని సాగు భూమిలో అటు, ఇటు తిప్పేందుకు కూడా పెద్దగా కష్టం ఏమీ కాదు. నా భర్త మొగులయ్య స్వయంగా ఈ పద్ధతితో విత్తనాలు వేశారు. సాధారణంగా అయితే ఎకరాకు రూ.25 వేల వరకు పంట మొత్తానికి ఖర్చు అయ్యేది. ఈ డ్రమ్ సీడర్తో రూ.10-12 వేలు మిగులుతాయి. పంట కూడా మంచి దిగుబడి వస్తుందని అధికారులు చెప్పడంతో, ఈ పద్ధతికి ముందుకు వచ్చాం.