వెల్దుర్తి, ఏప్రిల్ 13 : ఎక్కడో ఉన్న గోదావరి నీటిని మెదకు జిల్లాకు తరలించిన సీఎం కేసీఆర్ అపర భగీరథుడు అని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. గోదావరి జలాలు సోమవారం రాత్రి మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో ప్రవేశించాయి. సోమవారం అర్ధరాత్రి మాసాయిపేట చెక్డ్యాం పొంగిపొర్లడంతో మంగళవారం ఎమ్మెల్యే మదన్రెడ్డి, లేబర్ వెల్పేర్ కమిషన్ చైర్మన్ దేవేందర్రెడ్డి, ఫుడ్స్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డితో కలిసి మాసాయిపేట చెక్డ్యాం వద్ద గోదావరి జలాలకు క్షీరాభిషేకం చేసి, పసుపు, కుంకుమ, చీరె, సారె సమర్పించారు. గోదావరి జలాలతో వాగు ఒడ్డున ఉన్న సీతారామచంద్ర ఆశ్రమంలో సీతారామచంద్ర విగ్రహాలకు అభిషేకం, దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ.. ఉగాది పర్వదినాన మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలానికి గోదావరి జలాలు రావడం శుభసూచకం అన్నారు. గతంలో వర్షాలు సమృద్ధ్దిగా కురిసినప్పుడు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మాత్రమే హల్దీ వాగులో నీళ్లు కనిపించేవని, కానీ.. సీఎం కేసీఆర్ కృషి, పట్టుదలతో ఇప్పుడు మండుటెండల్లోనూ హల్దీవాగు నిండుగా పారుతుందని కలలో కూడా ఊహించలేదన్నారు.
పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతమైన వెల్దుర్తి మండలం, నర్సాపూర్ నియోజకవర్గంలో ఎలాంటి సాగునీటి వనరులు లేవని, నేడు ప్రవహిస్తున్న గోదావరి జలాలతో రైతుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోందని తెలిపారు. ఏడాదిన్నర కాలంలో నియోజకవర్గంలోని అన్ని చెరువులు, కుంటలను గోదావరి జలాలతో నింపడానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. వెల్దుర్తి, మాసాయిపేట మండలాలు కోనసీమను తలపించేలా సస్యశ్యామలం కానున్నాయని, రైతాంగానికి ఇలాంటి శుభదినం మరోటి లేదని అన్నారు. రెండు రోజుల్లో హల్దీ ప్రాజెక్టు పొంగిపొర్లనుందని, మంత్రి హరీశ్రావు ప్రాజెక్టును సందర్శించి పూజలు చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఎంపీపీ స్వరూప, రైతుబంధు మండల కోఆర్డినేటర్ వేణుగోపాల్రెడ్డి, ఎంపీటీసీలు నవనీత, కృష్ణారెడ్డి, సోని, సర్పంచ్లు మధుసూదన్రెడ్డి, ప్రణీత, శంకర్, నర్సింహులు, పెంటయ్య, నాయకులు స్టేషన్శ్రీను, నరేందర్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, సిద్ధ్దిరాంలుగౌడ్, సుధాకర్రెడ్డితో పాటు పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు.